Karnool Dimond: కర్నూలు జిల్లాలో పొలం దున్నుతుంటే రైతు కంటపడ్డ వజ్రం

Karnool District Farmers found a precious diamond in his farm
  • పొలం పనులు చేస్తుండగా కంటపడిన డైమండ్
  • మద్దికేర మండలం హంప గ్రామంలో ఘటన
  • ఇటీవలి వర్షాలతో జిల్లాలో మొదలైన వజ్రాల వేట

కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతుకు పొలంలో విలువైన వజ్రం దొరికింది. ఇటీవల కురిసిన వర్షాలకు వజ్రం బయటపడింది. పొలం పనులు చేస్తుండగా కంటపడిన వజ్రాన్ని రైతు భద్రంగా ఇంటికి తీసుకెళ్లాడు. విషయం తెలిసి వ్యాపారులు ఆయన ఇంటి ముందు క్యూ కట్టారు. ఆ వజ్రాన్ని సొంతం చేసుకోవడానికి వ్యాపారులు పోటీ పడడంతో వేలం నిర్వహించారు. ఇందులో పెరవల్లికి చెందిన ఓ వ్యాపారస్థుడు రూ.5 లక్షల నగదు, 2 తులాల బంగారం ఇచ్చి ఆ రైతు నుంచి వజ్రాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే, బహిరంగ మార్కెట్ లో ఆ వజ్రం విలువ రూ.10 లక్షల వరకు ఉంటుందని సమాచారం.

ఏటా వర్షాకాలం తొలకరి సమయంలో కర్నూలు జిల్లాలో వజ్రాల కోసం పొలాల్లో రైతులు, కూలీలు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారు వెతుకుతుంటారు. దీనికోసం ప్రత్యేకంగా భూమిని లీజుకు తీసుకుని, కూలీలను పెట్టి వెతికించే వాళ్లు కూడా ఉన్నారు. ఒక్క విలువైన వజ్రం దొరికితే దశ మారిపోయే అవకాశం కావడంతో రైతులు కూడా తమ పొలాల్లో వజ్రాల కోసం వెతుకుతుంటారు. ఇటీవల కురిసిన వర్షాలకు హంప గ్రామానికి చెందిన రైతు పొలంలో పనులు చేస్తుండగా ఈ విలువైన వజ్రం దొరికింది.

కాగా, భూమిలో దొరికే విలువైన వజ్రాలు, గుప్త నిధులు వంటివి చట్టప్రకారం ప్రభుత్వ ఖజానాకు చేర్చాల్సి ఉంటుంది. ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూముల్లో దొరికినా సరే అది ప్రభుత్వ ఆస్తేనని చట్టాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా రైతుకు దొరికిన వజ్రాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సిన అధికారులు.. తమకు పట్టనట్టు ఉండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News