వాళ్లు వ్యక్తిగత మైలురాళ్ల కోసం పాకులాడకుండా ఉంటే ఆర్సీబీ ఎన్నో టైటిళ్లు గెలిచేది: రాయుడు
- ఐపీఎల్ 17వ సీజన్ నుంచి నిష్క్రమించిన బెంగళూరు జట్టు
- నమ్మశక్యం కాని రీతిలో ప్లేఆఫ్స్ చేరిన ఆర్సీబీ
- ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓటమి
- ఆర్సీబీ అభిమానుల పరిస్థితి తాను అర్థం చేసుకోగలనన్న రాయుడు
తాజా సీజన్లో నమ్మశక్యంకాని రీతిలో పోరాటపటిమ కనబర్చి, ప్లేఆఫ్స్ లోకి ప్రవేశించిన బెంగళూరు జట్టు ఈసారి కప్ గెలుచుకుంటుందని ఆశలు పెట్టుకున్న వీరాభిమానులకు గుండెకోతే మిగిలింది. ఈ నేపథ్యంలో, ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు స్పందించారు.
"ఎన్నో ఏళ్లుగా తమ జట్టుకు విశేషంగా మద్దతిస్తూ వస్తున్న ఆర్సీబీ అభిమానుల పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. వారికి నా సానుభూతి. జట్టు మేనేజ్ మెంట్, సారథులు వ్యక్తిగత మైలురాళ్ల కంటే జట్టు ప్రయోజనాలకు పెద్దపీట వేసి ఉంటే... ఆర్సీబీ ఈపాటికి ఎన్నో టైటిళ్లు గెలిచి ఉండేది. ఎంతమంది అద్భుతమైన ఆటగాళ్లను వదిలేసుకున్నారో ఒక్కసారి చూడండి.
ఇకనైనా జట్టు ప్రయోజనాలకు తొలి ప్రాధాన్యత ఇచ్చే ఆటగాళ్లనే ఎంపిక చేయాలని మీ మేనేజ్ మెంట్ పై ఒత్తిడి తీసుకురండి. వచ్చే మెగా వేలం నుంచి ఓ మహోన్నత అధ్యాయం ప్రారంభవుతుందని ఆశిస్తున్నాను" అంటూ రాయుడు ఆర్సీబీ ఫ్యాన్స్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.