G. Kishan Reddy: రేవంత్ రెడ్డికి రైతుల కంటే ఎన్నికలే ముఖ్యంగా మారాయి: కిషన్ రెడ్డి

elections are more priority than farmers for revanth reddy
  • గతంలో రైతులను బీఆర్ఎస్ మోసం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆగ్రహం
  • కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో రైతులకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వడం లేదని విమర్శ
  • వ్యతిరేకత మూటగట్టుకోవడానికి బీఆర్ఎస్‌కు పదేళ్లు పడితే రేవంత్ ప్రభుత్వానికి 5 నెలలే పట్టిందని చురక

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల కంటే ఎన్నికలే ముఖ్యంగా మారాయని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన బీబీనగర్ మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఐకేపీ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవని విమర్శించారు. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. గతంలో రైతులను బీఆర్ఎస్ మోసం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు.

గతంలో కేసీఆర్ వరి వేస్తే ఉరి అని రైతులను ఇబ్బందులకు గురిచేశారని... ఇప్పుడు, దొడ్డు వడ్లు సాగు చేస్తే బోనస్ ఇవ్వబోమని రేవంత్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? అని నిలదీశారు. రైతులకు రుణమాఫీ లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో రైతులకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వడం లేదని విమర్శించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతి గింజను కొనేందుకు సిద్ధంగా ఉందని... రైతులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒట్లు పెట్టినంత మాత్రాన రైతులకు న్యాయం జరగదని ఎద్దేవా చేశారు.

రైతుల్లో వ్యతిరేకత మూటగట్టుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి పదేళ్లు పడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి 5 నెలలే పట్టిందన్నారు. దొడ్డు రకం వడ్లు వేసిన రైతులకు అన్యాయం చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రూ.2 లక్షల రుణమాఫీ చేయాలన్నారు. రైతులకు బ్యాంకర్లు రుణాలు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదని... కానీ ఢిల్లీకి సూట్‌కేసులు మోసుకెళుతున్నారని ఆరోపించారు. హామీలు అమలు చేయకుంటే గద్దె దిగాలన్నారు.

  • Loading...

More Telugu News