సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో తీవ్ర కుదుపులు... ఒకరి మృతి

సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానం అనూహ్య రీతిలో తీవ్ర కుదుపులకు గురికాగా, ప్రయాణికుల్లో ఒకరు మృతి చెందారు. ఈ విమానం లండన్ నుంచి సింగపూర్ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో మరో 30 మందికి గాయాలయ్యాయి. 

ఎయిర్ టర్బులెన్స్ కు గురైన ఈ బోయింగ్ విమానాన్ని థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బంది ఉన్నారు. 

కాగా, మృతి చెందిన ప్రయాణికుడి కుటుంబానికి సింగపూర్ ఎయిర్ లైన్స్ సంతాపం తెలియజేసింది. విమానాలు గాల్లోకి లేచాక, గరిష్ఠ ఎత్తుకు చేరిన తర్వాత, వాయు పీడనాల్లో మార్పు కారణంగా తీవ్రమైన కుదుపులకు గురవుతాయి. దీన్నే ఎయిర్ టర్బులెన్స్ అంటారు. 

వాతావరణ మార్పుల కారణంగా గాలి ప్రవాహం ఒక్కసారిగా దిశను మార్చుకుంటుంది. భిన్న దిశల నుంచి వీచే పెనుగాలులకు విమానం తీవ్రంగా ఊగిపోతుంది. ఈ కుదుపులు ఒక్కోసారి కొన్ని నిమిషాల పాటు కొనసాగుతాయి.

Singapore Airlines
Air Turbulence
London
Singapore

More Telugu News