ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్‌లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం.. వీడియో ఇదిగో!

 Air India Express flight caught fire makes emergency landing at Bengaluru airport
  • బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం
  • టేకాఫ్ అయిన నిమిషాల్లోనే విమానం ఇంజిన్‌లో మంటలు
  • ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతినిచ్చిన ఏటీసీ
  • ప్రమాద సమయంలో విమానంలో 179 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది
బెంగళూరు నుంచి కొచ్చి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి బెంగళూరులో ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో విమానంలో 179 మంది ప్రయాణికులతోపాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను అత్యవసరంగా ఖాళీ చేయించడంతో పెను ప్రమాదం తప్పింది. 

టేకాఫ్ అయిన కాసేపటికే
విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఇంజిన్‌లో మంటలు గుర్తించిన సిబ్బంది వెంటనే ఆ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌ (ఏటీసీ)కు చేరవేశారు. ఆ వెంటనే పూర్తిస్థాయి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి వచ్చింది. విమానం ల్యాండ్ కావడానికి ముందే అగ్నిమాపక సిబ్బందిని రన్‌వేపై మోహరించారు. 

విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను సురక్షితంగా కిందికి దింపినట్టు బెంగళూరు విమానాశ్రయ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగడానికి గల కారణంపై దర్యాప్తు ప్రారంభించినట్టు వివరించారు.
Advertisement
Air India Express
Bengaluru
Kochi
Emergency Landing

More Telugu News