Rashmika Mandanna: ప్రధాని మోదీపై రష్మిక మందన్న ప్రశంసలు

భారత్‌లో సముద్రంపై నిర్మించిన అత్యంత పొడవైన వంతెన ‘అటల్ సేతు’పై ప్రముఖ సినీనటి రష్మిక మందన్న ప్రశంసలు కురిపించారు. ముంబై రవాణా వ్యవస్థ తీరును మార్చేసిన గేమ్ ఛేంజర్ గా వంతెనను అభవర్ణించారు. మోదీ దార్శనికతపై కూడా ప్రశంసలు కురిపించారు. 

ముంబైని, నవీ ముంబైతో కలుపుటూ 22 కిలోమీటర్ల మేర ఈ వంతెనను నిర్మించిన విషయం తెలిసిందే. గతంలో ఈ రెండు ప్రాంతాల మధ్య 2 గంటలుగా ఉన్న ప్రయాణ సమయం అటల్ సేతుతో కేవలం 20 నిమిషాలకు తగ్గిపోయింది.  ఈ ఏడాది జనవరి నుంచి ఈ వంతెన ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 

వంతెన నిర్మాణ శైలి, ప్రజలకు ఉపయోగపడుతున్న తీరుపై రష్మిక మందన్న ప్రశంసించారు. ఈ మేరకు జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘ఒకప్పుడు రెండు గంటలుగా ఉన్న ప్రయాణ సమయం 20 నిమిషాలకు తగ్గిపోయింది. ఇది అస్సలు నమ్మశక్యంగా లేదు. అసలు ఇలాంటిది సాధ్యమని ఎవరైనా ఊహించారా? ముంబై నుంచి నవీ ముంబై వరకూ, ముంబై నుంచి బెంగళూరు వరకూ, గోవా నుంచి ముంబై వరకూ అద్భుత మౌలిక సదుపాయాల కల్పనతో ప్రతి ప్రయాణం సులువుగా సౌకర్యవంతంగా మారిపోయింది’’ అని అన్నారు. 

గతపదేళ్లలో దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయని రష్మిక మందన్న అన్నారు. మౌలిక వసతుల కల్పన అద్భుతమని పేర్కొన్నారు. రష్మిక వీడియోను ప్రధాని మోదీ కూడా షేర్ చేశారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడం కంటే సంతృప్తినిచ్చేది మరొకటి లేదని పేర్కొన్నారు.
Rashmika Mandanna
Atal Setu
Mumbai
Narendra Modi

More Telugu News