Team India: టీమిండియాను పాకిస్థాన్ పంపించేందుకు సిద్ధమైన బీసీసీఐ.. కానీ ఒకే ఒక్క కండిషన్

  • కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే మాత్రమే భారత జట్టుని పాక్ పంపుతామన్న రాజీవ్ శుక్లా
  • కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే నడుచుకుంటామన్న బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్
  • 2025 ఫిబ్రవరి-మార్చిలో పాక్ వేదికగా జరగనున్న ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ
if the central government gives permission then sent Team india to Pakistan says BCCI Vice President Rajeev Shukla

వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా పాల్గొంటుందా? భారత్ జట్టు పాకిస్థాన్ వెళ్తుందా?.. అనే సందేహాలను బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా నివృతి చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే మాత్రమే భారత జట్టును పాకిస్థాన్‌కు పంపిస్తామని, ఇదొక్కటే తమ ముందున్న కండిషన్ అని రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. ‘‘ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏది చెబితే అది చేస్తాం. భారత ప్రభుత్వం మాకు అనుమతి ఇస్తే మాత్రమే టీమిండియాను పాకిస్థాన్ పంపుతాం. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే నడుచుకుంటాం’’ అని అన్నారు. 

కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి -మార్చిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ టోర్నీ కోసం టీమిండియా పాక్ వెళ్లకపోవచ్చని మీడియాలో కథనాలు వెలువడుతున్న తరుణంలో ఈ అంశంపై రాజీవ్ శుక్లా క్లారిటీ ఇచ్చారు. కాగా టీమిండియా చివరిసారిగా 2008లో పాకిస్థాన్‌లో పర్యటించింది. 2008 ఆసియా కప్‌‌లో ఆడింది. ఆ తర్వాత మళ్లీ పాకిస్థాన్ వెళ్లలేదు. ఉగ్రవాదం నేపథ్యంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో ఈ ప్రభావం క్రికెట్ సంబంధాలపై కూడా పడిన విషయం తెలిసిందే. ఇక పాకిస్థాన్ డిసెంబర్ 2012-జనవరి 2013లో భారత్‌లో చివరిసారిగా ద్వైపాక్షిక సిరీస్ ఆడింది. అప్పటి నుంచి ఈ రెండు జట్లు కేవలం ఐసీసీ టోర్నమెంట్లు, ఆసియా కప్‌లలో మాత్రమే తలపడుతున్నాయి.

నిజానికి గతేడాది జరిగిన ఆసియా కప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చింది. అయితే భారత్ జట్టు అక్కడ పర్యటించేందుకు ససేమిరా అనడంతో పాకిస్థాన్ హైబ్రిడ్ విధానాన్ని ఉపయోగించాల్సి వచ్చింది. భారత్ ఆడే అన్ని మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించింది. ఆఖరికి పాకిస్థాన్ వర్సెస్ భారత్ మ్యాచ్‌ కూడా శ్రీలంకలోనే నిర్వహించింది. ఆ తర్వాత భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్-2023లో పాకిస్థాన్ పాల్గొంది. గ్రూప్ రౌండ్‌ నుంచి నిష్ర్కమించిన ఆ జట్టు భారత్‌లోని 5 వేర్వేరు వేదికల్లో మ్యాచ్‌లు ఆడింది.

  • Loading...

More Telugu News