Australia: ఆస్ట్రేలియాలో భారత విద్యార్థుల మధ్య ఘర్షణ... ఒకరి మృతి

Indian student stabbed to death in Australia Relative
  • ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన నవజీత్ సంధు
  • అక్కడ మరికొంతమంది భారతీయ విద్యార్థులతో ఉంటున్న సంధు
  • శనివారం విద్యార్థుల మధ్య ఘర్షణ.. వారించబోయిన సంధుపై కత్తితో దాడి
  • అక్కడికక్కడే దుర్మరణం..మృతదేహాన్ని భారత్ కు రప్పించేందుకు సన్నాహాలు

ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో దారుణం చోటుచేసుకుంది. అక్కడ భారత విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక విద్యార్థి మృతి చెందాడు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలు ఆలస్యంగా వెలుగుచూశాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఉన్నతవిద్య కోసం ఏడాదిన్నర క్రితం ఛత్తీస్ గఢ్ కు చెందిన నవజీత్ సంధు (22) ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ కు వెళ్లాడు. అక్కడ స్నేహితుడితో కలసి ఓ గదిలో ఉంటున్నాడు. నవజీత్ సంధు బంధువైన యశ్వీర్ కూడా మెల్ బోర్న్ లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి నవజీత్ ను ఇంటికి తీసుకెళ్లేందుకు యశ్వీర్ వచ్చాడు. అక్కడకు చేరుకోగానే నవజీత్ ఉంటున్న ఇంట్లో కేకలు వినబడుతున్నాయి. యశ్వీర్ వెళ్లి చూసే సరికి భారత్ కు చెందిన మరికొంతమంది విద్యార్థులు ఏదో విషయమై ఘర్షణ పడుతున్నారు. ఇంతలో నవజీత్ వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. వారి వద్దకు వెళ్లి తగవులాడుకోవద్దని చెప్పే క్రమంలో ఓ విద్యార్థి కత్తితో అతడిపై దాడి చేశాడు. 

 ఈ దాడిలో  నవజీత్ సంధు అక్కడికక్కడే చనిపోగా యశ్వీర్ తో పాటు మరో విద్యార్థి కూడా తీవ్రంగా గాయపడ్డారు. భారత్ లో ఉన్న తల్లిదండ్రులకు ఈ సమాచారాన్ని అందించారు. కొడుకు నవజీత్ సంధు చదువుకునేందుకు వారు ఒకటిన్నర ఎకరాల పొలం అమ్మి  విదేశాలకు పంపించారు. కొడుకు మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కాగా, నవజీత్ మృతదేహాన్ని భారత్ కు పంపించేందుకు భారత ప్రభుత్వం సాయం చేయాలని యశ్వీర్ అభ్యర్థించారు. 

  • Loading...

More Telugu News