ఇన్ స్టాలో లంచ్ ఫొటో పెట్టిన మోడల్.. లొకేషన్ తెలియడంతో వచ్చి కాల్చి చంపిన దుండగులు

Influencer 23 Shares Lunch On Instagram Attackers Find And Shoot Her
  • ఈక్వెడార్ లో దారుణ సంఘటన
  • పాత కక్షలతో బ్యూటీ క్వీన్, ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ ను హతమార్చిన వైనం
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
దక్షిణ అమెరికా దేశమైన ఈక్వెడార్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ 23 ఏళ్ల బ్యూటీ క్వీన్, మోడల్, ఇన్ స్టా గ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్ హత్యకు గురైంది. లాండీ పర్రాగా గోయ్ బురో అనే యువతిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. పట్టపగలు ఓ రెస్టారెంట్ లో అందరూ చూస్తుండగానే ఆమెను హతమార్చారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.

హత్యకు కాసేపటి ముందు లాండీ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో లంచ్ చేస్తున్న ఫొటోను పోస్ట్ చేశారు. లంచ్ లో ‘ఆక్టోపస్ సెవిచే’ అనే డిష్ తింటున్నట్లు క్యాప్షన్ పెట్టారు. దీంతో ఈ ఫొటో చూసిన దుండగులకు ఆమె ఏ రెస్టారెంట్ లో ఉందో తెలిసిపోయింది. వెంటనే ఇద్దరు షూటర్లు నేరుగా అక్కడకు చేరుకున్నారు. ఆ సమయంలో ఆమె మరో వ్యక్తితో ఉన్నారు. కాల్పుల నుంచి తప్పించుకొనేందుకు ఆమె ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇన్ స్టాగ్రామ్ లో లాండీకి 1.73 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

దుండుగులు ఆమెను కాల్చి చంపడానికి గల కారణం ఏమిటో ఇంకా తెలియరాలేదు. కానీ ఓ డ్రగ్ లార్డ్ తో ఆమెకు ఎఫైర్ ఉండేదని వార్తలు వినిపిస్తున్నాయి. కొంతకాలం తర్వాత హత్యకు గురైన ఆ డ్రగ్ లార్డ్ భార్య ప్రతీకారంలో భాగంగానే లాండీని హత్య చేయించినట్లు తెలుస్తోంది. అలాగే పాత నేరస్తులకు సంబంధించిన కేసులో అవినీతికి పాల్పడిన కొందరు న్యాయాధికారులతోనూ ఆమెకు లింకులు ఉన్నట్లు సమాచారం.
Go Back to Shorts
instagram influencer
ecuador
killed
video viral

More Telugu News