Varla Ramaiah: పెన్షన్ల దుమారం.. సీఎస్ జవహర్ రెడ్డిపై వర్ల రామయ్య ఫైర్

  • దురుద్దేశంతోనే పెన్షన్లను సజావుగా పంపిణీ చేయలేదన్న టీడీపీ సీనియర్ నేత 
  • టీచర్లు, అంగన్‌వాడీలు, గ్రామ సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకోలేరా అని ప్రశ్న
  • వృద్ధుల ఉసురు తీసింది సీఎం జగనేనని మండిపాటు
Varla Ramaiah fire on CS Jawahar Reddy

రాష్ట్రంలో పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సీఎస్ జవహర్ రెడ్డే కారణమని టీడీపీ సీనియర్ నేత ఆరోపించారు. ‘‘ఎంతమంది చచ్చిపోయినా పర్వాలేదు జగన్ మోహన్ రెడ్డికి మంచి చేస్తే చాలు అన్న ఆలోచన మీది కాదా’’ అని ఆయన ప్రశ్నించారు. ‘‘ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా పెన్షనర్ల కోసం మంచి చేయలేరా?. ఇంటి దగ్గర పెన్షన్ ఇప్పించలేరా?. రెండు మూడు రోజులపాటు టీచర్లను ఉపయోగించలేరా?. గ్రామ సచివాలయ సిబ్బందిని ఉపయోగించలేరా?. అంగన్‌వాడీ టీచర్లను ఉపయోగించలేరా?. తలచుకుంటే చేయగలరు మీరు. కానీ కావాలనే చేయలేదు. దురుద్దేశంతో చేయలేదు. పెన్షనర్లు ఇబ్బంది పడాలి. జగన్ మోహన్ రెడ్డికి మేలు జరగాలనేదే మీ ఆలోచన. పెన్షనర్లు ఏమైపోయినా పరవాలేదని మీరు అనుకున్నారు’’ అని వర్ల రామయ్య మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘ పెన్షన్లు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుపడ్డారని చెప్పి జగన్ ఓట్లు అడగాలనేదే కదా మీ ఆలోచన’’ అని జవహర్ రెడ్డిని వర్ల రామయ్య ప్రశ్నించారు. వృద్ధుల మృతికి జగన్ మోహన్ రెడ్డే కారణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎస్‌గా ఉన్న జవహర్ రెడ్డిని రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకొని వృద్ధుల ఉసురు తీశారని సీఎం జగన్‌పై మండిపడ్డారు.

  • Loading...

More Telugu News