lottery: రూ. కోటి గెలిచారని లాటరీ నిర్వాహకులు ఫోన్ చేస్తే మోసగాళ్లనుకొని కట్ చేసింది!

  • ఈమెయిల్ పంపినా స్కామ్ గా భావించి ఓపెన్ చేయని వైనం
  • మోసాలకు గురికాకుండా ఉండేందుకు ఓ బ్రిటిష్ మహిళ అతిజాగ్రత్త
  • ఎవరు అడిగినా బ్యాంకు వివరాలు చెప్పొద్దని పిల్లలకు ఆదేశం
Rs 1 Crore Winner Hangs Up Phone Call From Lottery Suspecting Scam

సైబర్ నేరాలపై అందరూ అవగాహన కలిగి ఉండటం మంచిదే.. కానీ అలా అని ప్రతి విషయాన్నీ గుడ్డిగా ఆన్ లైన్ ఫ్రాడ్ గా పొరబడితే మొదటికే మోసం వస్తుంది. ఓ బ్రిటిష్ మహిళకు ఇది అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. ఆమెను వరించిన అదృష్టం దాదాపు చేజారినంత పని అయ్యింది!! 

ఇంతకీ ఏం జరిగిందంటే.. ‘మా లాటరీలో మీరు లక్ష బ్రిటిష్ పౌండ్లు (రూ. కోటికి పైగా) గెలుచుకున్నారు. మీ బ్యాంకు వివరాలు చెబితే ఆ డబ్బు ట్రాన్స్ ఫర్ చేస్తాం’ అంటూ యూకేలోని గ్రేటర్ మాంచెస్టర్ లో ఉంటున్న అన్నే అనే మహిళకు లాటరీ నిర్వాహకులు ఇటీవల ఫోన్ చేశారు. అయితే వారిని ఆన్ లైన్ మోసగాళ్లుగా పొరబడిన ఆమె వెంటనే ఫోన్ కట్ చేసింది! తాను లాటరీ టికెట్ కొనుగోలు చేశాననే విషయాన్నే మరచిపోయింది! ఇంటికొచ్చే అదృష్టాన్ని వద్దనుకుంది.

దీంతో లాటరీ గెలుచుకున్న విషయాన్ని తెలియజేస్తూ నిర్వాహకులు ఆమెకు ఈమెయిల్ పంపారు. కానీ ఇన్ బాక్స్ లో ఆ మెయిల్ ను చూడగానే ఆమె అనుమానం మరింత బలపడింది! ఇది కచ్చితంగా సైబర్ నేరగాళ్ల పనేనని భావించింది. ఈమెయిల్ ను తెరిస్తే ఎక్కడ తన బ్యాంకు ఖాతాలోని డబ్బు పోతుందోనన్న భయంతో దాన్ని ఓపెన్ చేయలేదు. తన ఇద్దరు పిల్లలకు కూడా ఇదే విషయాన్ని చెప్పింది. అనుమానాస్పద వెబ్ లింకులను తెరవొద్దని.. ఎవరు అడిగినా బ్యాంకు వివరాలు చెప్పొద్దని ఆదేశించింది.

ఇక చేసేది లేక లాటరీ నిర్వాహకులు అన్నే అడ్రస్ వెతుక్కుంటూ వచ్చారు. వీధి చివర నిలబడి చెక్కులు చూపించారు. దీంతో అప్పటికి ఆమె బుర్రలో లైట్ వెలిగింది. తాను లాటరీ టికెట్ కొన్న విషయం గుర్తొచ్చింది. ఇంకేముంది.. ఎగిరి గంతేసి మురిపెంగా ఆ చెక్కులను అందుకుంది.

లాటరీ సొమ్మును ఏం చేస్తారని అడగ్గా తాను చైర్ పర్సన్ గా ఉన్న స్థానిక విలేజ్ హాల్ కోసం కొంత ఖర్చుచేస్తానని.. మరికొంత డబ్బును కండరాల బలహీనత వ్యాధితో బాధపడుతున్న తన భర్త లాంటి వారికి చికిత్స అందించే కేంద్రాలకు విరాళంగా అందిస్తానని చెప్పింది.

ఆమె పొరుగు ఇళ్ల వారైన రాయ్, జూలీ సైతం ఇదే లాటరీలో రూ. కోటి చొప్పున గెలుచుకోవడం మరో విశేషం.


  • Loading...

More Telugu News