ఢిల్లీ పోలీసులు తనకు నోటీసులు ఇవ్వడంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy responds on Delhi police notices
  • లోక్ సభ ఎన్నికల్లో గెలిచేందుకు ఢిల్లీ పోలీసులను ప్రయోగిస్తున్నారని ఆరోపణ
  • బీజేపీపై పోరాడే వారికి అమిత్ షా నోటీసులు ఇస్తున్నారన్న రేవంత్ రెడ్డి
  • బీజేపీని ప్రశ్నించినందుకే తమకు నోటీసులు ఇచ్చారని వ్యాఖ్య
అమిత్ షా ఫేక్ వీడియో అంశంలో ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. లోక్ సభ ఎన్నికల్లో గెలిచేందుకు ఢిల్లీ పోలీసులను ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ బీజేపీ బెదిరింపులకు భయపడేవాళ్లు ఎవరూ లేరన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో బీజేపీని ఓడించి తీరుతామని సవాల్ చేశారు. బీజేపీపై పోరాడే వారికి అమిత్ షా నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు.

బీజేపీని ప్రశ్నించినందువల్లే తనకు, తనతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులకు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. నాకు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చారన్నారు. ఇప్పటి వరకు ప్రధాని మోదీ విపక్షాలపై ఈడీ, సీబీఐని ప్రయోగించారని... ఇప్పుడు ఢిల్లీ పోలీసులను కూడా ప్రయోగిస్తున్నారన్నారు. 

మొన్న కర్ణాటక, నిన్న తెలంగాణలో అధికారంలోకి వచ్చామని, రేపు దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతున్నామన్నారు. రిజర్వేషన్లను రద్దు చేయడానికే బీజేపీ 400 సీట్లను అడుగుతోందని ఆరోపించారు. రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు.
Advertisement
Revanth Reddy
Congress
Amit Shah
BJP
Lok Sabha Polls

More Telugu News