YS Jagan: చంద్రబాబులాగా నేనేమీ బడాయిలు చెప్పడంలేదు... మీరే మార్కులు వేయండి: కందుకూరులో సీఎం జగన్

  • నెల్లూరు జిల్లా కందుకూరులో సీఎం జగన్ సభ
  • బుర్రా మధుసూదన్ యాదవ్, విజయసాయిలను గెలిపించాలని పిలుపు
  • ఈ 58 నెలల ప్రోగ్రెస్ రిపోర్టును ప్రజల ముందు ఉంచుతున్నానని వెల్లడి
  • పథకాలన్నీ అందాలంటే వైసీపీకే ఓటేయాలని స్పష్టీకరణ 
CM Jagan speech in Kandukur

సీఎం జగన్ ఇవాళ నెల్లూరు జిల్లా కందుకూరులో ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. కందుకూరు అసెంబ్లీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్, నెల్లూరు పార్లమెంటు స్థానం వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిలను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

కందుకూరు సభలో ఆయన ప్రసంగిస్తూ, తానేమీ చంద్రబాబు మాదిరిగా సెల్ ఫోన్లు నేనే కనిపెట్టాను అని బడాయిలు చెప్పడంలేదని అన్నారు. ఈ 58 నెలల కాలంలో తన  పాలన ప్రోగ్రెస్ రిపోర్టును రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతున్నానని, ప్రజలే మార్కులు వేయాలని అన్నారు. 

మీ బిడ్డ జగన్ కు మీరు అధికారం ఇవ్వడం వల్లే మీ గ్రామాల్లో కొత్తగా ఏడు వ్యవస్థలు అందుబాటులోకి తీసుకురాగలిగాడు అని వివరించారు. గ్రామ/వార్డు సచివాలయాలు, 60-70 ఇళ్లకు ఒక వాలంటీరు, నాడు-నేడు పథకంతో రూపురేఖలు మారిన ప్రభుత్వ పాఠశాల, అందులో ఇంగ్లీషు మీడియం చదువులు, రైతన్నల కోసం ఆర్బీకే వ్యవస్థలు, విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష సేవలు, మహిళా పోలీస్, ఓ డిజిటల్ లైబ్రరీ, ఫైబర్ గ్రిడ్ వంటివి ఈ 58 నెలల కాలంగా సాకారం చేశాం అని సీఎం జగన్ వివరించారు.

ఈ వ్యవస్థలన్నీ ఇలాగే కొనసాగాలంటే, నా పాలన బాగుందంటే మన పార్టీకి ఓటేయండి అని పిలుపునిచ్చారు. ఇప్పుడు అందిస్తున్న అమ్మఒడి, ఆసరా, చేయూత, పెన్షన్ పథకాలన్నీ అందాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలని అన్నారు. 

"మనది ఇంటింటా కనిపించే అభివృద్ధి. మరి చంద్రబాబుది కేవలం ఈనాడు, ఈటీవీ, ఏబీఎన్, టీవీ5లో మాత్రమే కనిపిస్తుంది. అందరూ ఆలోచించాలి. చంద్రబాబుకు ఓటేస్తే ప్యాకేజి స్టార్ కు ఇంత, ఈనాడు రామోజీరావుకు ఇంత, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఇంత, టీవీ5 నాయుడికి ఇంత... వీళ్లందరికీ నేరుగా డీబీటీ! దత్తపుత్రుడికి ఇంత, వదినమ్మకు ఇంత అంటూ వీరందరికీ మనీ ట్రాన్స్ ఫర్!... జన్మభూమి కమిటీలకు పేటీఎం! దీనిపై అందరూ ఆలోచించమని కోరుతున్నా. 

మీ జగన్ బటన్ నొక్కితే నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాలోకి నగదు చేరుతుంది. అదే చంద్రబాబు నొక్కితే తన పెత్తందారీ మిత్రుల ఖాతాల్లోకి చేరుతుంది. ఇదే రాష్ట్రం... ఇదే బడ్జెట్! అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడే తక్కువ... గ్రోత్ రేట్ కూడా పెరిగింది. 

మీ బిడ్డ ఎలా బటన్లు నొక్కగలిగాడు... కనీవినీ ఎరుగని విధంగా మీ బిడ్డ ఇన్ని స్కీములు ఎలా ఇవ్వగలిగాడు... నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి రూ.2.70 లక్షల కోట్లు ఎలా వేయగలిగాడు అని ఆలోచించమని ప్రజలను కోరుతున్నా. ఈ డబ్బంతా చంద్రబాబు పాలనలో ఎవరి జేబుల్లోకి వెళ్లిందో ఓసారి గమనించాలి. ప్రలోభాలు, మోసాలతో వస్తున్న చంద్రబాబుకు ఓటేసి ప్రజలు మోసపోవద్దని కోరుతున్నా" అంటూ సీఎం జగన్ ప్రసంగించారు.

More Telugu News