Harish Rao: రేపు 10 గంటలకు రాజీనామా లేఖతో వస్తున్నాను... రేవంత్ రెడ్డి సిద్ధమా... దమ్ముంటే రా?: హరీశ్ రావు

  • రేపు ఉదయం పది గంటలకు అమరులస్థూపం వద్దకు రాజీనామా లేఖతో రావాలని సవాల్
  • మనిద్దరి రాజీనామా లేఖలను మేధావుల చేతికి ఇద్దామన్న హరీశ్ రావు
  • హామీలు నెరవేరిస్తే నా రాజీనామా లేఖను వారే స్పీకర్‌కు ఇస్తారు....
  • నెరవేర్చకుంటే రేవంత్ రెడ్డి రాజీనామా లేఖను గవర్నర్ చేతికి ఇస్తారన్న బీఆర్ఎస్ నేత
Harish Rao challenges CM Revanth Reddy

రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ముందు ఉన్న అమరవీరుల స్థూపం వద్దకు నేను రాజీనామాతో వస్తాను... నువ్వు వస్తావా? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీశ్ రావు మరోసారి సవాల్ విసిరారు. మెదక్ జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ... రుణమాఫీపై రాజీనామాతో సిద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి తనకు చెప్పారని... రేపు ఉదయం అమరులస్థూపం వద్దకు రావాలన్నారు. నేను రాజీనామా లేఖ పట్టుకొని వస్తాను... రాజీనామా లేఖ పట్టుకొని వచ్చే దమ్ము నీకూ ఉందా? అని ప్రశ్నించారు.

అగస్ట్ 15లోగా రుణమాఫీ చేస్తానన్న రేవంత్ రెడ్డి సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానన్నారు. ఇది నిజమే అయితే... బాండ్ పేప‌ర్ మీద రాసిచ్చిన గ్యారెంటీలు అమ‌లు చేస్తానన్న మాట నిజ‌మైతే గ‌న్‌పార్క్ వ‌ద్ద‌కు రమ్మని సూచించారు. రాజీనామా లేఖ‌ల‌ను మేధావుల చేతుల్లో పెడదామన్నారు.

ఆగ‌స్ట్ 15 లోగా రుణ‌మాఫీ, ఆరు గ్యారెంటీల‌ను అమ‌లు చేస్తే మేధావులు వెళ్లి తన రాజీనామా లేఖ‌ను స్పీక‌ర్‌కు ఇస్తారని... అమ‌లు చేయ‌క‌పోతే రేవంత్ రెడ్డి రాజీనామా లేఖ గ‌వ‌ర్న‌ర్‌కు ఇస్తారని పేర్కొన్నారు. 'నువ్వు దానికి సిద్ధ‌మా? అని అడుగుతున్నా. ద‌మ్ముంటే రా. మాట మీద నిల‌బ‌డే వ్య‌క్తివి అయితే రా.. నువ్వు రాక‌పోతే తోక ముడిచిన‌ట్టే' అని హ‌రీశ్ రావు అన్నారు. 

రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను మోసం చేశాడన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమ‌లు కావాలంటే.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయ‌కుల‌కు అహంకారం నెత్తికెక్కిందని... గాలి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. వారిని భూమి మీద‌కు తేవాలంటే మెదక్ నుంచి వెంక‌ట్రామిరెడ్డిని పార్ల‌మెంట్‌కు పంపించాలన్నారు.

More Telugu News