మనకు భారమనుకున్న బంగ్లాదేశ్​ ఎలా ఉంది.. మనమేంటి..? సిగ్గుపడదాం.. పాకిస్థాన్​ పీఎం షహబాజ్​ వ్యాఖ్యలు

  • పారిశ్రామికవేత్తలతో సమావేశంలో బాధ వెళ్లగక్కిన పాక్ ప్రధాని
  • దేశ ఆర్థిక పరిస్థితి దిగజారడంపై ఆవేదన
  • భారతదేశంతో వాణిజ్యం కోసం చర్చలు జరపాలని పారిశ్రామికవేత్తల సూచనలు
బంగ్లాదేశ్ ను చూసి పాకిస్థాన్ సిగ్గుపడాలని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. ఆ దేశ పారిశ్రామిక వేత్తలతో సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారిపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. బాధను వెళ్లగక్కారు.

‘‘ఒకనాడు మనలో భాగమై తూర్పు పాకిస్థాన్ గా పిలుచుకున్న బంగ్లాదేశ్ ప్రాంతాన్ని పాకిస్థాన్ భుజాలపై తీవ్ర భారమని భావించాం. ఇప్పుడు బంగ్లాదేశ్ ఏ స్థాయికి చేరిందో అందరికీ తెలుసు. ఇప్పుడు మనం వారివైపు చూసి సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉంది” అని షహబాజ్ పేర్కొన్నారు.

భారత దేశంతో చర్చలు జరపండి
పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ గాడిన పడటానికి కృషి చేయాలని పారిశ్రామిక వేత్తలను పాక్ పీఎం షహబాజ్ షరీఫ్ కోరారు. అందుకోసం అనుసరించాల్సిన మార్గాలను సూచించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ లో రాజకీయ అస్థిరతను పారిశ్రామికవేత్తలు ఎత్తి చూపారు. రాజకీయ స్థిరత్వం దిశగా ప్రయత్నాలు చేయాలని సూచించారు. 

అంతేగాకుండా భారత దేశంతో వాణిజ్యం తిరిగి విస్తృతం అయ్యేందుకు ప్రయత్నించాలని.. ఇందుకోసం భారత ప్రభుత్వంతో చర్చలు జరపాలని పారిశ్రామికవేత్తలు కోరారు. ఇది పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు మార్గం వేస్తుందని స్పష్టం చేశారు.

Pakistan
Bangladesh
international news
shehbaz

More Telugu News