Andhra Paper Mill: ఆంధ్ర పేపర్ మిల్ లాకౌట్.. కార్మికుల ఆందోళన

  • 23 రోజులుగా సమ్మె బాటలో ఉన్న కార్మికులు
  • ఊహించని విధంగా లాకౌట్ ప్రకటించిన మిల్ యాజమాన్యం
  • మిల్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు
Andhra paper mill lockout

రాజమండ్రిలో ఉన్న ఆంధ్ర ప్రేపర్ మిల్ కు ఎంతో చరిత్ర ఉంది. ఎంతో పేరుగాంచిన ఈ ఆంధ్ర పేపర్ మిల్ లాకౌట్ ప్రకటించింది. మిల్ గేట్లకు యాజమాన్యం తాళం వేసింది. మరోవైపు, ఉన్నట్టుండి లాకౌట్ ప్రకటించడం పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గేటు వద్ద వారు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

మరోవైపు ఏప్రిల్ 2వ తేదీ నుంచి పేపర్ మిల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. గత 23 రోజులుగా వారు సమ్మెలో ఉన్నారు. కొత్త వేతన ఒప్పందం కోసం సమ్మె చేస్తున్నారు. ఆంధ్ర పేపర్ మిల్ ఏడాదికి రూ. 200 కోట్ల నికరలాభంలో ఉందని... అయినప్పటికీ మిల్ లో పని చేస్తున్న 2,500 మంది కార్మికుల వేతన ఒప్పందాల పట్ల నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందంటూ వారు సమ్మెకు దిగారు.

ఈ క్రమంలోనే ఊహించని విధంగా మిల్ యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. దీంతో, కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మిల్ మెయిన్ గేటు వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. మరోవైపు ఇటీవల సీఎం జగన్ పేపర్ మిల్ మీదుగా వెళ్తున్నప్పుడు... కార్మికులు ఆయనను కలిశారు. వారి సమస్యలను ముఖ్యమంత్రికి చెప్పుకున్నారు.

More Telugu News