Sajjala Ramakrishna Reddy: కోడలు కొడుకును కంటానంటే అత్త వద్దంటుందా? అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఎవరు మర్చిపోగలరు?: సజ్జల

  • ఏపీలో ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోందన్న సజ్జల
  • జగన్ పాలన అన్ని వర్గాల వారు ఎంజాయ్ చేస్తున్నారని వెల్లడి
  • మహిళా సాధికారతకు జగన్ పెద్దపీట వేస్తున్నారని వివరణ
  • చంద్రబాబు ఇంకా బూజుపట్టిన భావాలతో కొట్టుకుంటున్నారని విమర్శలు
Sajjala take a dig at Chandrababu Naidu

రాష్ట్రంలో ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోందని, సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.  జగన్ పాలనను ప్రజలంతా ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు. 

బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నవారు తిరిగి చెల్లిస్తున్నారని, మళ్లీ రుణాలు తీసుకుని వివిధ వృత్తుల్లో పెట్టుబడులు పెడుతున్నారని వివరించారు. మహిళా సాధికారతకు జగన్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. 

మరోవైపు, చంద్రబాబు ఇంకా బూజుపట్టిన భావాలతో ఎలా కొట్టుకుంటున్నారో అందరికీ తెలుసని సజ్జల పేర్కొన్నారు. చంద్రబాబుకు మహిళలంటే చిన్నచూపు అని విమర్శించారు. కోడలు కొడుకును కంటానంటే అత్త వద్దంటుందా? అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఎవరు మర్చిపోగలరు? అని అన్నారు. 

మహిళలే కుటుంబంలో కేంద్రక వ్యవస్థలా ఉండాలి అని భావించే జగన్ ఎక్కడ... మహిళలను కాలి కిందేసి తొక్కాలి, వాళ్లకు సాధికారత ఉండకూడదు, వాళ్లు ఇంట్లో చాకిరీ చేసుకుంటే సరిపోతుంది అని భావిస్తూ, పైపై మాటలు చెప్పే చంద్రబాబు ఎక్కడ? అని సజ్జల వ్యాఖ్యానించారు. 

"చంద్రబాబునాయుడు కుటుంబం గురించి మాట్లాడుతుంటారు. రామ్మూర్తినాయుడు అనే ఆయన ఎక్కడున్నాడో, ఏమిటో ఎవరికైనా తెలిసిందా? అసలు ఆయన ఉన్నాడా? చెల్లెళ్లు ఇద్దరో ఏమో ఉన్నారట... వాళ్లు ఎక్కడైనా ఉన్నారా? వాళ్లనెప్పుడైనా కలిశారా? 

చంద్రబాబు కుటుంబం అంటే... తను, తన భార్య, తన కొడుకు... తన ప్రపంచం తనది. అలాంటి చంద్రబాబు ఇవాళ చెల్లెలి గురించి, విలువల గురించి మాట్లాడుతుంటారు. ఏ వ్యక్తి అయితే చెల్లెళ్లను రాచిరంపాన పెట్టాడో, వాళ్లని పూర్తిగా నిర్లక్ష్యం చేశాడో, వాళ్లు కష్టాల్లో ఉంటే పట్టించుకోలేదో... ఇలాంటి వ్యక్తి ఇవాళ 'చెల్లెలు' గురించి మాట్లాడుతున్నారు. ఎవరైనా వింటే నవ్వుతారు. 

అధికారంలోకి రాలేమన్న ఫ్రస్ట్రేషన్ తో చంద్రబాబు మాట్లాడుతున్నారు. అందుకే ఆయన నోటి వెంట బూతులు కూడా వస్తున్నాయి. వాళ్ల అనుకూల మీడియాలో జగన్ పై వచ్చే రాతలను మన నోటితో పలకలేం" అంటూ సజ్జల వ్యాఖ్యానించారు.

More Telugu News