Chandrababu: జగన్ నుంచి రూ. 82 కోట్లు అప్పు తీసుకున్నానన్న షర్మిల.. చంద్రబాబు స్పందన

  • జగన్, భారతి నుంచి తీసుకున్న అప్పుల వివరాలను అఫిడవిట్ లో తెలిపిన షర్మిల
  • తండ్రి ఆస్తి కొట్టేసి చెల్లెలికి అప్పు ఇచ్చిన దుర్మార్గుడు జగన్ అని చంద్రబాబు మండిపాటు
  • ఇలాంటి వ్యక్తి ప్రజలకు ఏం చేస్తాడని ప్రశ్న
Chandrababu comments on Sharmila loan from Jagan

తన అన్న సీఎం జగన్, వదిన వైఎస్ భారతి నుంచి తాను అప్పు తీసుకున్నట్టు ఏపీసీసీ చీఫ్ షర్మిల ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే. జగన్ నుంచి రూ. 82.58 కోట్లు, భారతి నుంచి రూ. 19.56 లక్షలు అప్పుగా తీసుకున్నానని ఆమె వెల్లడించారు. తన మొత్తం ఆస్తులు రూ. 182.82 కోట్లు అని ఆమె తెలిపారు. సొంత అన్న నుంచి షర్మిల కోట్ల రూపాయల అప్పు తీసుకున్నారనే విషయం సంచలనం రేకెత్తించింది. మరోవైపు, జగన్ నుంచి షర్మిల అప్పు తీసుకోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

తండ్రి మొత్తం ఆస్తిని కొట్టేసిన దుర్మార్గుడు జగన్ అని చంద్రబాబు విమర్శించారు. చెల్లెలు షర్మిలకు ఆస్తిలో వాటా ఇవ్వకుండా... అప్పు ఇచ్చాడని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సొంత చెల్లెలికే న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకు ఏం చేస్తాడని ప్రశ్నించారు. 

పొలాల్లో సర్వే రాళ్లపై కూడా జగన్ తన ఫొటో వేసుకుంటున్నాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడ చూసినా శ్రీకాకుళం జిల్లాకు చెందిన కార్మికులు కనిపిస్తుంటారని... ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వం వస్తుందని... శ్రీకాకుళం వాసులకు స్థానికంగానే ఉపాధి అవకాశాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని చెప్పారు. డ్వాక్రా సంఘాలకు రూ. 10 లక్షల వరకు వడ్డీలేని రుణాలిస్తామని తెలిపారు. ఉత్తరాంధ్రలో క్లీన్ స్వీప్ చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News