K Kavitha: కవితను అరెస్ట్ చేయబోమని చెప్పలేదు: కవిత బెయిల్ పిటిషన్‌పై ఈడీ సుదీర్ఘ వాదనలు

  • కవితను అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఎప్పుడూ చెప్పలేదన్న ఈడీ
  • అరెస్ట్ ప్రక్రియ అంతా చట్టబద్ధంగానే జరిగిందని, సెక్షన్ 19 ప్రకారం అరెస్ట్ చేసే అధికారం ఉందని వెల్లడి
  • కవితను అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే కోర్టులో హాజరుపరిచామన్న ఈడీ
ED arguments on Kavitha bail petition

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ బుధవారానికి వాయిదా పడింది. బెయిల్ పిటిషన్‌పై వాదనలు తిరిగి రేపు కొనసాగనున్నాయి. కవితకు బెయిల్ ఇవ్వవద్దంటూ ఈడీ మంగళవారం గంటన్నరసేపు వాదనలు వినిపించింది. కవితను అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఎప్పుడూ చెప్పలేదని కోర్టుకు ఈడీ తెలిపింది. ఎక్కడా కోర్టు ధిక్కారణకు పాల్పడలేదని వెల్లడించింది. అరెస్ట్ చేయబోమని తాము కోర్టుకు అండర్ టేకింగ్ కూడా ఇవ్వలేదని వెల్లడించింది. కేవలం పది రోజుల వరకు మాత్రమే సమన్లు ఇవ్వబోమని చెప్పామని తెలిపింది. ఈ అంశంపై కవిత కూడా తాను వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు కోర్టుకు ఈడీ వెల్లడించింది.

అరెస్ట్ ప్రక్రియ అంతా చట్టబద్ధంగానే జరిగిందని, సెక్షన్ 19 ప్రకారం తమకు అరెస్ట్ చేసే అధికారం ఉందని పేర్కొంది. ఈ కుంభకోణంలో సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చినట్లు తెలిపింది. కవిత ఆదేశాల మేరకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవలు రూ.25 కోట్లు ఇచ్చినట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించి వారు వాంగ్మూలం కూడా ఇచ్చారని తెలిపింది. మద్యం పాలసీని సౌత్ గ్రూప్‌కు అనుకూలంగా మార్చినట్లు కోర్టుకు తెలిపింది. ఇండో స్పిరిట్ కంపెనీ ద్వారా లంచాల సొమ్ము కవిత తిరిగి రాబట్టుకున్నారని పేర్కొంది. ట్రాన్సిట్ రిమాండులో ఎలాంటి ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేసింది.

కవితను అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే కోర్టులో హాజరుపరిచామని, పీఎంఎల్ఏ ప్రత్యేక చట్టం కనుక ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదని పేర్కొంది. ఈ చట్టం కింద మహిళలకు ప్రత్యేక హక్కులు ఏమీ ఉండవని తెలిపింది. అరుణ్ పిళ్లై... కవితకు బినామీ అని ఆరోపించింది. ఈ వ్యవహారంలో కవిత, కేజ్రీవాల్ మధ్య రాజకీయ అవగాహన ఉన్నట్లు తెలిపింది. డీల్‌లో భాగంగా రూ.100 కోట్లు ఇచ్చినట్లు దినేశ్ అరోరా దర్యాఫ్తులో అంగీకరించినట్లు తెలిపింది.

బుచ్చిబాబు వాట్సాప్ చాట్‌లో కూడా ఈ విషయం వెలుగు చూసినట్లు తెలిపింది. ఆర్థిక నేరాల కుట్ర గుట్టుగా జరుగుతోందన్నారు. ఈ కేసుల్లో నేరుగా నగదు వ్యవహారాల ఆధారం దొరికే అవకాశం ఉండదని పేర్కొంది. వివిధ రకాల వ్యక్తుల స్టేట్‌మెంట్స్, ఇతర సాక్ష్యాల ఆధారంగా అక్రమ సొమ్మును మాత్రం గుర్తించవచ్చునని పేర్కొంది. ఈ కేసు విచారణ ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉందని, కవితకు ఈ కేసులో పూర్తిస్థాయిలో సంబంధం ఉందనే దానికి ఆధారాలు ఉన్నాయన్నారు.

More Telugu News