Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై మరో కేసు

  • శ్రీరామ నవమి వేడుకల్లో ఎలక్షన్ కోడ్‌ ఉల్లంఘించారనే ఆరోపణలపై కేసు నమోదు
  • ఆ రోజు పోలీసుల‌ అనుమతి లేకుండా ర్యాలీ తీసిన రాజా సింగ్‌
  • సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగరంలో శాంతిభద్రతల దృష్ట్యా ఆయ‌న‌ ర్యాలీకి అనుమతి ఇవ్వ‌ని పోలీసులు  
Police Case Registered against BJP MLA Raja Singh

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై మరో కేసు నమోదైంది. శ్రీరామ నవమి వేడుకల సంద‌ర్భంగా ఆయ‌న‌ ఎలక్షన్ కోడ్‌ ఉల్లంఘించారనే ఆరోపణలపై సుల్తాన్ బజార్ పోలీసులు రాజా సింగ్‌పై కేసు న‌మోదు చేయ‌డం జ‌రిగింది. ఐపీసీ 188, 290 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన‌ట్లు స‌మాచారం. ఈ నెల 18వ తారీఖున‌ పోలీసులు కేసు నమోదు చేయగా, ఆల‌స్యంగా విషయం బ‌య‌ట‌కు వచ్చింది. 

ఈ నెల 17న శ్రీరామనవమి సందర్భంగా అనుమతి లేకుండా ర్యాలీ తీసిన నేప‌థ్యంలో ఆయ‌న‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగరంలో శాంతిభద్రతల దృష్ట్యా రాజా సింగ్ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వ‌లేదు. పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌క‌పోయినప్పటికీ, బీజేపీ కార్య‌క‌ర్త‌లు, త‌న అనుచరులతో క‌లిసి రాజా సింగ్ భారీ ర్యాలీ నిర్వ‌హించారు. 

దీంతో ఈ విష‌యాన్ని సీరియస్‌గా తీసుకున్న‌ అప్జల్ గంజ్ పోలీసులు ఆయ‌న‌పై సుమోటోగా కేసు నమోదు చేయడం జ‌రిగింది. ఇక ఇప్ప‌టికే ప‌లు వివాదాస్ప‌ద ఘ‌ట‌న‌ల కార‌ణంగా రాజా సింగ్‌పై కేసులు న‌మోదు కావ‌డం, జైలుకి వెళ్ల‌డం కూడా జ‌రిగింది.

More Telugu News