Punjab: పంజాబ్‌లో చైనా డ్రోన్ల క‌ల‌క‌లం..!

  • రెండు చైనా డ్రోన్ల‌ను స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్ ద‌ళాలు
  • అమృత్‌స‌ర్ జిల్లాలోని హ‌ర్డో ర‌ట్ట‌న్, గ్రామ‌డాక్‌లో రెండు డ్రోన్లు ప‌ట్టుబ‌డిన‌ట్లు అధికారుల వెల్ల‌డి
  • వీటిని చైనాకు చెందిన సంస్థ త‌యారు చేసిన‌ డీజేఐ మావిక్-3 క్లాసిక్‌గా గుర్తించిన‌ అధికారులు
BSF Officials Seized Two China Drones in Punjab

పంజాబ్ రాష్ట్రంలో చైనా డ్రోన్లు క‌ల‌క‌లం సృష్టించాయి. ఇంటెలిజెన్స్ స‌మాచారం ద్వారా బార్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్‌), పంజాబ్ పోలీసులు సంయుక్తంగా అనుమానిత ప్రాంతాల్లో ఆదివారం సెర్చ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించ‌గా అమృత్‌స‌ర్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో రెండు చైనా డ్రోన్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. అమృత్‌స‌ర్ జిల్లాలోని హ‌ర్డో ర‌ట్ట‌న్, గ్రామ‌డాక్ వ్య‌వ‌సాయ పొలాల్లో రెండు డ్రోన్లు ప‌ట్టుబ‌డిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. 

మ‌ధ్యాహ్నం 12.15 గంట‌ల ప్రాంతంలో ఒక డ్రోన్ ప‌ట్టుబ‌డ‌గా, మ‌ళ్లీ రెండు గంట‌ల త‌ర్వాత రెండో డ్రోన్‌ను స్వాధీనం చేసుకోవ‌డం జ‌రిగింది. వీటిని చైనాకు చెందిన సంస్థ త‌యారు చేసిన‌ డీజేఐ మావిక్-3 క్లాసిక్‌గా అధికారులు స్ప‌ష్టం చేశారు. వీటికంటే ముందు బీఎస్ఎఫ్ ద‌ళాలు ఫిరోజ్‌పూర్ జిల్లా సరిహ‌ద్దులో మూడు హెరాయిన్ పొట్లాల‌ను తీసుకెళ్తున్న ఓ డ్రోన్‌ను ప‌ట్టుకున్నాయి. రాష్ట్ర రాజ‌ధాని చండీగ‌ఢ్‌కు సుమారు 300 కిలోమీట‌ర్ల దూరంలోని నేస్తా గ్రామానికి స‌మీపంలోని పొలాల్లో ఈ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

ఇక రాష్ట్ర‌వ్యాప్తంగా డ్ర‌గ్స్ స్మ‌గ్లింగ్‌ను అడ్డుకోవ‌డంతో బీఎస్ఎఫ్ బ‌ల‌గాలు కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. 2023లో 107 డ్రోన్ల‌ను గుర్తించిన ద‌ళాలు ఏకంగా 442 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకోవ‌డం జ‌రిగింది. భార‌త్‌-పాక్ స‌రిహ‌ద్దులో డ్రోన్ల‌తో మాద‌క ద్ర‌వ్యాల‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లు భ‌ద్ర‌తా ద‌ళాలు పేర్కొన్నాయి. గ‌తంలోనూ ఫిరోజ్‌పూర్ ప్రాంతంలో భారీ మొత్తంలో డ్ర‌గ్స్ ప‌ట్టుబ‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో ఇరుదేశాల బార్డ‌ర్‌లో నిరంత‌రం నిఘా పెట్ట‌డం జ‌రుగుతోంది. అలాగే అనుమానిత ప్రాంతాల్లో ఎప్ప‌టిక‌ప్పుడు బీఎస్ఎఫ్ సెర్చ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హిస్తోంది.

More Telugu News