Karnataka: కర్ణాటకలో దారుణం.. భార్య ముందే మరో వివాహితపై అత్యాచారం, మతమార్పిడి!

  • తనను బలాత్కరించి, ఆపై మతమార్పిడి చేశారని బాధితురాలి ఫిర్యాదు
  • నుదుట కుంకుమ ధరించొద్దన్నారని, తనతో బుర్ఖా ధరింపజేశారని ఆరోపణ
  • భర్తకు విడాకులు ఇవ్వాలని తనను బలవంతం పెట్టారని ఫిర్యాదు
  • బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు
Karnataka woman raped by man in front of his wife forced to convert case against couple

కర్ణాటకలో మరో షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. తనపై అత్యాచారం, బలవంతపు మతమార్పిడి జరిగిందంటూ 28 ఏళ్ల వివాహిత తాజాగా పోలీసులను ఆశ్రయించింది. వ్యక్తిగత ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేసి మతం మారాలని బలవంతం పెట్టారని ఆరోపించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, రఫీక్, అతడి భార్య ఆమెను ఉచ్చులోకి దింపి లైంగిక చర్యల్లో పాల్గొన్నారు. అనంతరం ఆమె ఫొటోలు తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు దిగారు. బాధితురాలిని హిందూమతం నుంచి ఇస్లాంలోకి మారాలంటూ బలవంతం చేశారు. 2023 నుంచి తాము ముగ్గురం కలిసే ఉంటున్నామని బాధితురాలు పేర్కొంది. తాము చెప్పిందల్లా వినాలని ఒత్తిడి చేశారని పేర్కొంది. గతేడాది రఫీక్ తనను అతడి భార్య ముందే బలాత్కరించాడని ఆరోపించింది. 

ఈ ఏప్రిల్‌లో వారు తనను నుదుట కుంకుమ ధరించొద్దని ఆదేశించారని చెప్పింది. బలవంతంగా బుర్ఖా ధరింపచేశారని, రోజుకు ఐదు సార్లు నమాజ్ చేయించారని చెప్పింది. తనను కులంపేరుతో దూషించారని, వెనకబడిన వర్గానికి చెందిన తాను ఇస్లాంలోకి మారాలని చెప్పారని బాధితురాలు ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. భర్తకు విడాకులు ఇవ్వమని నిందితుడు తనను బలవంతం పెట్టాడని పేర్కొంది. తను చెప్పినట్టు చేయకపోతే వ్యక్తిగత ఫొటోలు లీక్ చేస్తానంటూ రఫీక్ బెదిరించాడని పేర్కొంది. 

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేశారు. కర్ణాటక మతస్వేచ్ఛ చట్టం, ఐటీ చట్టం, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు, అత్యాచారం, కిడ్నాప్, బెదిరింపులకు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

More Telugu News