Nara Brahmani: మీ ఇల్లు అక్కడుంది... ఇక్కడ కాదు అని లోకేశ్ తో జోక్ చేస్తుంటాం: నారా బ్రాహ్మణి

  • మంగళగిరి నియోజకవర్గంలో నారా బ్రాహ్మణి పర్యటన
  • ఇవాళ స్త్రీ శక్తి పేరిట మహిళలతో ముఖాముఖి
  • మహిళల అభ్యున్నతికి లోకేశ్ కట్టుబడి ఉన్నారని వెల్లడి
Nara Brahmani held meeting with women In Mangalagiri

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణి గత రెండ్రోజులుగా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నిన్న వివిధ వర్గాల వారిని కలిసి వారి సమస్యలు తెలుసుకున్న నారా బ్రాహ్మణి నేడు కూడా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్త్రీ శక్తి పేరిట మహిళలతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఒక వివాహిత యువతి మాట్లాడుతూ, తాము నారా లోకేశ్ అన్నను విపరీతంగా అభిమానిస్తామని, ఎంత అభిమానం అంటే లోకేశ్ అన్న కోసం మైలవరం నుంచి ఓటును మంగళగిరికి మార్చుకున్నామని తెలిపారు. ఈ మాట వినగానే నారా బ్రాహ్మణి ముగ్ధురాలయ్యారు. 

నారా లోకేశ్ తన కుటుంబ సభ్యులను ఎంత ప్రేమిస్తారో, అంతకంటే ఎక్కువగా ప్రజలను ప్రేమిస్తారని బ్రాహ్మణి తెలిపారు. అందుకే ఎక్కువ సమయం మంగళగిరిలోనే గడుపుతుంటారని వివరించారు. "ఒక్కోసారి నన్ను, దేవాన్ష్ ను చూడ్డానికి వీకెండ్స్ లో కూడా రారు. అందుకే... మీ ఇల్లు అక్కడున్నట్టుంది... ఇక్కడ కాదు అని ఆయనతో జోక్ చేస్తుంటాం" అని బ్రాహ్మణి వివరించారు. 

మంగళగిరిలో మహిళల అభ్యున్నతికి లోకేశ్ ఎంతో కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. అంతేకాదు, స్థానిక చేనేత పరిశ్రమకు వెన్నుదన్నుగా నిలిచి, వారికి మరిన్ని మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని లోకేశ్ పరితపిస్తుంటారని బ్రాహ్మణి తెలిపారు. అందుకే టాటా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఇక్కడ వీవర్ శాల స్థాపించి చేనేత రంగానికి చేయూతనిచ్చే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. 

ఇక ఈ సమావేశంలో జనసేన పార్టీ మహిళా కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. వారు నారా లోకేశ్ విజయానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పారు. దాంతో నారా బ్రాహ్మణి సంతోషం వ్యక్తం చేశారు. మనం అందరం ఒక్కటేనమ్మా... కలసికట్టుగా పనిచేద్దాం అని పిలుపునిచ్చారు.

More Telugu News