Surjit Bhalla: ప్రపంచంలో ఏమాత్రం నమ్మతగినది కానివి సీఎంఐఈ గణాంకాలే: ప్రముఖ ఆర్థికవేత్త

  • బలహీనంగా ఉన్న తమిళనాడులో ఆ పార్టీకి కనీసం 5 సీట్లు గెలుచుకోవచ్చని వెల్లడి
  • కేరళలోనూ ఒకట్రెండు స్థానాలు లభించే అవకాశం ఉందని అంచనా
  • లోక్ సభ ఎన్నికల్లో రాబోయే ఫలితాలపై ఎన్డీటీవీకి ఇంటర్వ్యూ
CMIE data is not reliable says economist surjit bhalla

ఈసారి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 2019లో సాధించిన ఫలితాలకన్నా మెరుగైన పనితీరు కనబరిచే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థికవేత్త, సెఫాలజిస్ట్ సుర్జీత్ భల్లా అభిప్రాయపడ్డారు. బీజేపీకి సొంతంగానే 330 నుంచి 350 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేశారు. ‘హౌ వుయ్ ఓట్’ పేరుతో ఓటర్ల ఆలోచనా విధానంపై తాజాగా పుస్తకం రచించిన ఆయన తాజాగా ఎన్డీటీవీకి శనివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను తెలియజేశారు. 

బీజేపీకి 2019లోకన్నా దాదాపు 7 శాతం ఎక్కువ సీట్లు రావొచ్చు..
“గణాంకాల ఆధారంగా ఉన్న అవకాశాలను పరిశీలిస్తే.. వారికి (బీజేపీ) 330 నుంచి 350 సీట్లు సొంతంగానే రావొచ్చు. 2019 ఫలితాలకన్నా 5 నుంచి 7 శాతం ఎక్కువ సీట్లు సాధించొచ్చు” అని సుర్జీత్ భల్లా తెలిపారు. అయితే తమిళనాడులో బలహీనంగా ఉన్న బీజేపీ ఈసారి కనీసం 5 సీట్లు గెలుచుకోవచ్చని ఆయన అంచనా వేశారు. అలాగే కేరళలో ఆ పార్టీకి ఒకట్రెండు సీట్లు రావొచ్చన్నారు. 

2014లోకన్నా కాంగ్రెస్ కు 2 శాతం తక్కువ సీట్లు వచ్చే అవకాశం
ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ 44 సీట్లు లేదా 2014లో ఆ పార్టీకి వచ్చిన సీట్లకన్నా 2 శాతం తక్కువ సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేశారు. “విపక్ష కూటమి నాయకత్వ సమస్య ఎదుర్కొంటోంది. ప్రతిపక్షం ఒకవేళ సామాన్య ప్రజల్లో ఆదరణగల నాయకుడిని ఎంపిక చేసుకొని ఉండి ఉంటే లేదా ప్రధాని మోదీకి ఉన్న ప్రజాదరణలో సగమైనా ఉన్న నేతను సెలక్ట్ చేసి ఉంటే అప్పుడు రెండు కూటముల మధ్య పోటీ ఉండేది” అని భల్లా అభిప్రాయపడ్డారు.

దేశంలో పేదరికం తగ్గింది
ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడటం వల్లే బీజేపీకి ఎక్కువ సీట్లు లభించే అవకాశం కనిపిస్తోందని భల్లా అంచనా వేశారు. “ప్రజల జీవితాల్లో ఎంత మేరకు మార్పు వచ్చిందో దాని ఆధారంగానే భారత్ ఓటేస్తుంది. ఇది ఒక ప్రాథమిక సిద్ధాంతం. అంతేకానీ కులం, లింగభేదం కాదు. అలాగే ప్రజలు ఆపాదించే ఇతర అంశాలు కూడా ఇందుకు కారణం కాదు. దేశ ఆర్థిక రంగమే దీన్ని నిర్దేశిస్తుందని బిల్ క్లింటన్ 1992లోనే చెప్పారు” అని భల్లా అన్నారు. ప్రస్తుతం దేశంలో పేదల జీవితాల్లో చెప్పుకోదగ్గ మార్పు కనిపిస్తోంది. దేశ జనాభాలో ఒక శాతం లేదా 1.4 కోట్ల మంది పేదలు ఉండటం అనేది పేదరికానికి ఉన్న పాత నిర్వచనమని ఆయన పేర్కొన్నారు. కానీ దేశం అభివృద్ధి చెందిందని.. తలసరి వినియోగం మెరుగుపడిందని చెప్పారు. కాబట్టి దేశ జనాభాలో నాలుగో వంతు పేదలే ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

సీఎంఐఈ గణాంకాలు ఆధారపడ్డ తగ్గవి కాదు..
దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై ప్రముఖ పరిశోధన సంస్థ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించిన గణాంకాలు నమ్మతగినవి కావని భల్లా అన్నారు. ఈ గణాంకాల్లో తమకు నచ్చిన వాటిని తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల ప్రచారంలో బీజేపీని లక్ష్యంగా చేసుకుంటోందని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడైనా ద్రవ్యోల్బణం పెరిగిందని, నిరుద్యోగులకు ఉద్యోగాల్లేవనే చెబుతుంది. కానీ ఉదాహరణకు 2019తో పోలిస్తే దేశంలో ప్రస్తుతం నిరుద్యోగుల సంఖ్య తక్కువగా ఉంది” అని భల్లా అభిప్రాయపడ్డారు. సీఎంఐఈ గణాంకాలను తానొక్కడినే తప్పుబట్టట్లేదని భల్లా చెప్పారు. ఎందరో రచయితలు కూడా ఆ గణాంకాలను ప్రశ్నించారని పేర్కొన్నారు. యెమెన్, ఇరాక్ లోకన్నా తక్కువగా అంటే 10 శాతం మందిలోపే మహిళలు దేశంలో ప్రస్తుతం పనిచేస్తున్నట్లు సీఎంఐఈ గణాంకాలు చెబుతున్నాయని, కానీ ఇది అసంబద్ధమని ఆయన కొట్టిపారేశారు. ప్రపంచంలో ఏమాత్రం నమ్మతగినది కానివి సీఎంఐఈ గణాంకాలేనని ఆయన విమర్శించారు. ప్రతిపక్షం ఇష్టపడుతుందన్న ఉద్దేశంతోనే ఈ గణాంకాల్లో కరెన్సీ ప్రస్తావన చేసిందన్నారు.

More Telugu News