Iran: తప్పిన యుద్ధ ప్రమాదం.. వెనక్కు తగ్గిన ఇరాన్, ఇజ్రాయెల్

  • శుక్రవారం ఇరాన్‌పై ఇజ్రాయెల్ మిసైల్ దాడులు
  • ఇరాన్‌లోని మిలిటరీ స్థావరం సహా పలు చోట్ల పేలుళ్లు
  • ఇజ్రాయెల్ ఆయుధాలు అల్పమైనవంటూ ఇరాన్ కామెంట్
  • ఇరాన్‌ కామెంట్స్‌పై ఇజ్రాయెల్ మౌనం
  • రెండు దేశాలు వెనక్కు తగ్గడంతో యుద్ధం ముప్పు తప్పిందన్న అంచనాలు
Iran Israel Appear To Pull Back From Brink As US Approves Military Aid

మధ్యప్రాచ్యంపై యుద్ధ మేఘాలు తొలగిపోయినట్టే కనిపిస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ రెండూ ఆచితూచి వ్యవహరిస్తుండటంతో యుద్ధం ముప్పు తప్పినట్టేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

డమాస్కస్‌లో (సిరియా) తమ కమాండర్‌ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ ఇటీవల 300లకు పైగా మిస్సైళ్లు, డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. వీటిల్లో అధికశాతం మిసైళ్లను మిత్రదేశాలతో కూల్చేసిన ఇజ్రాయెల్ తాను ప్రతీకార దాడులకు దిగింది. శుక్రవారం ఇజ్రాయెల్ దాడులతో పలుచోట్ల పేలుళ్లు సంభవించాయి. అయితే, ఇరాన్.. ఇజ్రాయెల్ దాడిని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేసింది. కేవలం మూడు పేలుళ్ల ఘటనలే వెలుగులోకి వచ్చాయని పేర్కొంది. ‘‘నిన్న రాత్రి జరిగింది అసలు దాడే కాదు. ఏవో రెండు, మూడు క్వాడ్‌కాప్టర్లు దాడి చేశాయి. ఆ ఆయుధాలు మా దేశంలో పిల్లలు ఆడుకునే ఆటబొమ్మల స్థాయిలో ఉన్నాయి. ఇజ్రాయెల్ మళ్లీ ఇలాంటి దుస్సాహసాలకు దిగనంతవరకూ మేము ఏమేమీ స్పందించము’’ అని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి హుస్సైన్ అమీర్ అబ్దుల్లా పేర్కొన్నారు. 

మరోవైపు ఇజ్రాయెల్ ఎటువంటి బహిరంగ ప్రకటనా చేయలేదు. ఇరాన్‌పై దాడులకు సంబంధించి ఎటువంటి వివరణ ఇవ్వలేదు. దీంతో, యుద్ధం ముప్పు తప్పిపోయిందని అంతర్జాతీయ సమాజం ఊపిరిపీల్చుకుంది. అయితే, ఇరాకీ మిలిటరీ స్థావరంలో భారీ పేలుడు సంభవించడంతో ఉద్రిక్తతలు పూర్తిగా సద్దుమణగలేదన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.  

మరోవైపు ఇజ్రాయెల్‌ సైనిక సామర్థ్య పెంపు దిశగా ఆర్థికసాయం అందించేందుకు అమెరికా సిద్ధమైంది. 13 బిలియన్ డాలర్ల అర్థికసాయం అందించేందుకు ఉద్దేశించిన బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. ఈ బిల్లును పాలస్తీనా అధినాయకత్వం ఖండించింది. అమెరికా ఆర్థికసాయం కారణంగా పాలస్తీనాలో ఎందరో అమాయకులు బలికానున్నారని మండిపడింది.

More Telugu News