DK Shivakumar: మా సోదరుడికి ఓటేస్తే మీకు నీళ్లిస్తామన్న డీకే శివకుమార్‌పై కేసు నమోదు

  • బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోన్న డీకే సోదరుడు సురేశ్
  • ఓ హౌసింగ్ సొసైటీలో ప్రచారం చేసిన డీకే శివకుమార్
  • సురేశ్‌ను గెలిపిస్తే మూడు నెలల్లో మీ ప్రధాన సమస్యను పరిష్కరిస్తానని వెల్లడి
  • ప్రలోభాలకు గురి చేసినందుకు కేసు నమోదు
DK Shivakumar Faces Police Case For Undue Influence At Elections

లోక్ సభ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకుగాను కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై పోలీసు కేసు నమోదయింది. తన సోదరుడు డీకే సురేశ్‌కు ఓటు వేస్తేనే కావేరీ నది నుంచి నీటిని ఇస్తానని బెంగళూరు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినందుకు గాను ఆయనపై ఈ కేసు నమోదయింది. లోక్ సభ ఎన్నికల్లో డీకే సురేశ్ బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. సోదరుడి తరఫున డీకే శివకుమార్ ఇటీవల ఓ హౌసింగ్ సొసైటీలో ప్రచారం నిర్వహించారు. ఈ సమయంలో ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

'నేను ఇక్కడికి ఓ బిజినెస్ డీల్ కోసం వచ్చాను. నా సోదరుడు సురేశ్‌ను మీరు గెలిపిస్తే మూడు నెలల్లో మీ ప్రధాన సమస్యను పరిష్కరిస్తాను. కావేరీ నదీ జలాలు సరఫరా చేసి మీకు అవసరమైన నీటిని కేటాయిస్తాం' అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు బీజేపీ వీడియోను కూడా విడుదల చేసింది. డీకే శివకుమార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని... తన సోదరుడి కోసం ఓట్లను దోపిడీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ మండిపడింది.

ఈ వ్యాఖ్యలపై చర్చలు తీసుకోవాలని బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీనిని పరిశీలించిన ఎన్నికల సంఘం డీకే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లుగా ధ్రువీకరించింది. ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినందుకు ఆయనపై పోలీసు కేసు నమోదు చేసినట్లు కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు.

More Telugu News