Chandrababu: ఆ 11 సర్వేలు కూటమిదే గెలుపు అని చెబుతున్నాయి: చంద్రబాబు

  • కృష్ణా జిల్లా పెడనలో ప్రజాగళం సభ
  • హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్
  • పండుగ పూట కూడా జనం భారీగా తరలి వచ్చారన్న చంద్రబాబు
  • కూటమి విజయానికి ఇదే సంకేతం అని వెల్లడి
Chandrababu said all surveys predicts alliance victory

టీడీపీ అధినేత చంద్రబాబు కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన జనసేనాని పవన్ కల్యాణ్ ను రియల్ హీరో అని అభివర్ణించారు. టీడీపీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణను కూడా అభినందించారు. పొత్తులో భాగంగా బందరు ఎంపీ టికెట్ ను జనసేన తరఫున సిట్టింగ్ ఎంపీ బాలశౌరికి ఇవ్వాలని నిర్ణయించామని, ఒక్క మాట కూడా ఎదురుచెప్పకుండా ఆ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించిన వ్యక్తి కొనకళ్ల నారాయణ అని చంద్రబాబు కొనియాడారు. 

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన బూరగడ్డ వేదవ్యాస్ కు సైతం ఈసారి పొత్తు కారణంగా టికెట్ ఇవ్వలేకపోయామని విచారం వ్యక్తం చేశారు. కానీ వేదవ్యాస్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, రాష్ట్రం బాగు కోసం నేను త్యాగం చేస్తానని చెప్పారని చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని, వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేసుకునేందుకు వస్తే వారిని అనుమతిస్తారా? అని ప్రశ్నించారు. 

"ఇవాళ  శుభదినం... శ్రీరామ నవమి. పండుగ పూట కూడా ఇలా తరలివచ్చిన జనాలను చూస్తే మన విజయాన్ని ఎవరూ ఆపలేరన్న విషయం అర్థమవుతోంది. తప్పకుండా మన రాష్ట్రంలో రామరాజ్య స్థాపన చేస్తాం. ఇది జరగాలంటే మీరేం చేయాలి? నాడు రాముడు రావణాసురుడ్ని చంపాడు. జగనాసురుడ్ని మీరేం చేయాలి? వధ జరగాలా, వద్దా?

ఆ వర్గం, ఈ వర్గం అని తేడా లేకుండా అందరినీ నట్టేట ముంచిన వ్యక్తి సైకో జగన్. నేను జగన్ మోహన్ రెడ్డి అనడంలేదు... పేరు మార్చా... జేగన్ రెడ్డి సైకో! నిన్న చాలా సర్వేలు వచ్చాయి. మళ్లీ పోలింగ్ తర్వాతే సర్వేలు వస్తాయి. చివరిగా 11 సర్వేలు వస్తే... ఆ 11 సర్వేల్లో 17 నుంచి 23 ఎంపీ స్థానాలు మనమే గెలుస్తున్నాం. కానీ ఒక దుర్మార్గుడు ఉన్నాడు... ఎప్పుడైనా ఇంట్లోంచి బయటికి వచ్చాడా? పరదాలు కట్టుకుని తిరిగాడా లేదా? 

గత ఎన్నికల సమయంలో ఊరూరా తిరిగాడు. నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అడ్డుకుని ఉంటే అతడు తిరగ్గలిగేవాడా? కానీ మేం ప్రజాస్వామ్యయుతంగా ముందుకు వెళ్లాం. ఊరూరా తిరిగి ఒక్క చాన్స్ అన్నాడు, మోసం చేశాడు. నెత్తి మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు... మీరు ఐసు మాదిరిగా కరిగిపోయారు. ఐదేళ్లు గడిచిపోయాయి... ఏమైంది? గుద్దుడే గుద్దుడు... బాదుడే బాదుడు... మీరంతా ఆ దెబ్బలు తిని అలసిపోయాడు. 

మళ్లీ నిన్న బయల్దేరాడు కొత్త బిచ్చగాడు. గతంలో బాబాయ్ ని గొడ్డలిపోటుతో లేపేసి డ్రామా ఆడాడు. ఆ నేరం మాపై మోపాడు. నిన్ననే గులకరాయి డ్రామాకు తెరలేపాడు. ఆయన వచ్చాడంట... కరెంటు పోయిందంట... పవన్ కల్యాణ్ అక్కడికి వెళ్లి ఒక గులకరాయి వేశాడంట... లేకపోతే చంద్రబాబు అక్కడికి వెళ్లి హత్యాయత్నం చేశాడంట! 

కానీ, క్వార్టర్ బాటిల్, బిర్యానీ, రూ.500 డబ్బులు ఇస్తానని చెప్పావు... డబ్బులు ఇవ్వకపోతే కోపం వచ్చి రాయి వేశానని ఆ దొరికిన వ్యక్తే చెబుతున్నాడు! జగన్ పై రాయి దాడి జరిగితే నేను, పవన్ కల్యాణ్, ప్రధాని మోదీ అందరం ఖండించాం. కానీ, నాపై, పవన్ పై దాడి జరిగితే అతడు ఖండించలేదు. మా మీద  వేసిన రాళ్లు దొరికాయి... ఈ డ్రామా రాయుడిపై వేసిన రాయి దొరకలేదు. ఎవరికైనా ఆ గులకరాయి కనిపించిందా? ఏమిటా రహస్యం? 

నిన్నటిదాకా పరదాలు కట్టుకుని తిరిగి, ఇవాళ వచ్చి మద్యం ద్వారా, ఇసుక ద్వారా దోచేసిన డబ్బుతో మిమ్మల్ని కొనాలని ప్రయత్నిస్తున్నాడు. మా దగ్గర డబ్బులేదు... నీతి ఉంది, నిజాయతీ ఉంది, నిస్వార్థం ఉంది, మళ్లీ మీ జీవితాల్లో వెలుగు తెచ్చే సామర్థ్యం ఉంది.

మాట్లాడితే... అందరూ కలిశారు అంటున్నాడు. అవును కలిశాం... టీడీపీ, జనసేన, బీజేపీ నేతలం కలిశాం. ఏ ఒక్కరి కోసమో కాదు... అందరం తగ్గాం... ప్రతి ఒక్కరం తగ్గాం... ప్రజల గెలుపు కోసమే తగ్గాం. సర్దుబాటు చేసుకున్నాం... ప్రజల గెలుపు కోసం తగ్గాం. పవన్ కల్యాణ్ పార్టీ గత ఎన్నికల్లో రాష్ట్రమంతా పోటీ చేసింది... టీడీపీ గతంలో అధికారంలో ఉంది... బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది... కానీ ఈసారి అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్యం అజెండాగా మా మూడు జెండాలు కలిశాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ, తెలుగు ప్రజల వెలుగే మా ధ్యేయం. 

ఈయన శవాలతో వస్తున్నాడు... మనుషులతో రావడంలేదు. మా నాన్న చనిపోయాడు... తండ్రిలేని బిడ్డను అంటూ 2014లో వచ్చాడు... 2019లో బాబాయ్ ని చంపేశారంటూ వచ్చాడు... ఇప్పుడు పెన్షన్ దారుల శవాలను తీసుకురావాలని యత్నించాడు. 

ఇతడ్ని చూస్తే అందరూ భయపడిపారిపోతున్నారు. 20-30 ఎమ్మెల్యేలు పార్టీని వదిలి పెట్టి పోయే పరిస్థితికి వచ్చారు... ఎంపీలది కూడా అదే పరిస్థితి. ఎమ్మెల్సీలైతే ఇంకా పదవీకాలం ఉండగానే ఆ పార్టీ నుంచి బయటికి వచ్చేస్తున్నారు. గుంటూరు జడ్పీ చైర్ పర్సన్ కూడా ఆ పార్టీని వీడారు. ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తున్నా... అందరూ రండి... ఎన్డీయేలో చేరండి... మాకు అండగా ఉండండి... ఈ ఉద్యమంలో భాగస్వాములు కండి. 

ఈసారి ఎన్నికల్లో వైసీపీకి ఓటేస్తే మురిగిపోతుంది... రాష్ట్రంలో, దేశంలో అధికారంలోకి వచ్చేది ఎన్డీయే కూటమే. 400 సీట్లతో మోదీ ప్రధాని కాబోతున్నారు. 2047 నాటికి భారత్ ప్రపంచదేశాల్లో అగ్రదేశంగా తయారవుతుంది. తెలుగుజాతి అగ్రగామిగా ఉండాలన్నదే నా ఆలోచన, పవన్ ఆలోచన. 

ఇక్కడ 25 ఎంపీ స్థానాల్లో గెలిపించాలి, 160 పైచిలుకు అసెంబ్లీ స్థానాలు రావాలి... జగన్ చిత్తు చిత్తుగా ఓడిపోవాలి. ఆ పార్టీని భూస్థాపితం అన్నా చేయాలి, లేకపోతే కూకటివేళ్లతో సహా పెకలించి బంగాళాఖాతంలో పడేయాలి" అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

More Telugu News