Randeep Surjewala: హేమమాలినిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. రణదీప్ సుర్జేవాలాకు ఈసీ షాక్!

  • బీజేపీ ఎంపీ హేమమాలినిపై అభ్యంతరకర వ్యాఖ్యల నేపథ్యంలో ఈసీ సీరియస్
  • సుర్జేవాలాకు షోకాజ్ నోటీసులు 
  • సుర్జేవాలా సమాధానం పరిశీలించిన అనంతరం చర్యలు
  • రెండు రోజుల పాటు ప్రచారం నిర్వహించొద్దంటూ ఆదేశాలు
Congress Randeep Surjewala barred from campaigning for 2 days over Hema Malini comment

బీజేపీ ఎంపీ హేమమాలినిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలాపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఆయన రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా నిషేధం విధించింది. 

మార్చి 31న కురుక్షేత్ర నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సుర్జేవాలా.. హేమమాలినిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ మేరకు బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాలవీయ ‘ఎక్స్‌’లో ఓ వీడియోను షేర్ చేశారు. సుర్జేవాలా వ్యాఖ్యలు మహిళలను అగౌరవపరిచే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. మరోవైపు, సుర్జేవాలాపై తక్షణం చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ కూడా ఈసీకి లేఖ రాసింది. 

ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం సుర్జేవాలాకు నోటీసులు జారీ చేసింది. అయితే, తన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందని సుర్జేవాలా బదులిచ్చారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి వీడియో తన టీం చిత్రీకరించిందని, అందులో ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు ఎక్కడా లేదని పేర్కొన్నారు. అయితే, ఈసీ మాత్రం సుర్జేవాలా రెండు రోజుల పాటు ప్రచారం నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేసింది.

More Telugu News