TDP: టీడీపీ కేంద్ర కార్యాలయంలో 'ఎన్ రీచ్' కార్యక్రమం.... ఎన్ఆర్ఐలకు దిశానిర్దేశం

  • ఎన్నికల వేళ టీడీపీకి ఎన్ఆర్ఐల మద్దతు
  • పార్టీ కోసం పనిచేసేందుకు ముందుకొచ్చిన 1500 మంది ఎన్ఆర్ఐలు
  • టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకంగా వర్క్ షాప్
Workshop for NRIs held at TDP head office in Mangalagiri

త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపుకు ఎలా పనిచేయాలనే దానిపై ఎన్ఆర్ఐలకు దిశా నిర్దేశం చేసేందుకు నేడు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. 

బూత్ లెవల్ లో పనిచేసేందుకు రిజిస్టర్ చేయించుకున్న 1500 మంది టీడీపీ ఎన్ఆర్ఐలు చంద్రబాబును సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలుపు కోసం  క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు 1500 మంది ఎన్ఆర్ఐ లు తమ వివరాలు నమోదు చేయించుకున్నారని టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం వెల్లడించింది. 

ఇలా ముందుకొచ్చిన ఎన్ఆర్ఐలు టీడీపీ అభ్యర్థుల గెలుపునకు ఎలా పనిచేయాలి, ఓటర్లను ఎలా ప్రభావితం చేయాలి? ఎలా పనిచేయాలి?  అనే అంశాలపై మార్గదర్శకం చేసేందుకు ఎన్ఆర్ఐ టీడీపీ 'ఎన్ రీచ్' కార్యక్రమం నిర్వహించింది. 

ఈ సందర్భంగా టీడీపీ మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్  మాట్లాడుతూ... ఎన్ఆర్ఐలు తెలుగుదేశం పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లు అన్నారు. బ్రిటీష్ వారి కంటే నిరంకుశంగా జగన్ రెడ్డి పాలిస్తున్నాడని, అతన్ని గద్దె దించి ప్రజలకు స్వేచ్ఛ రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. 

ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను ప్రభావితం చేసేలా ఎన్ఆర్ఐలు పనిచేయాలని సూచించారు. ఎన్డీయే బాపట్ల ఎంపీ అభ్యర్థి కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు విజన్ కు హైదరాబాద్ నిదర్శనమని, ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం పదేళ్లలోనే అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని అన్నారు. 

టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడు వేమూరి రవికుమార్ మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పనిచేసేందుకు ఎన్ఆర్ఐలు సిద్ధంగా ఉన్నారని, టీడీపీ కమిటీల్లో ఎన్ఆర్ఐలకు అవకాశాలు కల్పిస్తామని అన్నారు. 

టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం కో ఆర్డినేటర్ కోమటి జయరాం, ఎన్ఆర్ఐ టీడీపీ గల్ఫ్ కో ఆర్డినేషన్ కమిటీ అధ్యక్షుడు రాధాకృష్ణ,, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చి రాంప్రసాద్  సహా పలువురు నేతలు, ఎన్ఆర్ఐలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

More Telugu News