KCR: బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే మీ గతి ఏమవుతుందో ఆలోచించండి: పోలీసులకు కేసీఆర్ వార్నింగ్

  • బీఆర్ఎస్ వారిని పోలీసులు సభకు రాకుండా ఆపేస్తున్నారని ఆగ్రహం
  • మీ డ్యూటీ మీరు చేయాలని పోలీసులకు సూచన
  • అన్నీ రికార్డ్ చేస్తున్నామని వ్యాఖ్య 
KCR warning to police

పోలీసులకు, పోలీస్ ఉన్నతాధికారులకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే మీ గతి ఏమవుతుందో ఆలోచించండని హెచ్చరించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బీఆర్ఎస్ వారిని పోలీసులు సభకు రాకుండా ఆపేస్తున్నారని మండిపడ్డారు.

పోలీస్ మిత్రులకు ఓ విజ్ఞప్తి చేస్తున్నానని... మీ డ్యూటీ మీరు చేయండని సూచించారు. బీఆర్ఎస్ కూడా పదేళ్లు అధికారంలో ఉందని గుర్తు చేశారు. అమాయకులను బెదిరించడం... కొట్టడం... బీఆర్ఎస్ ఫ్లెక్సీలను పీకేయడం సరికాదన్నారు. పోలీసులు తమ అరాచకాలను బంద్ చేయాలని హెచ్చరించారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మీ గతి ఏమవుతుందో చూడాలన్నారు. పదేళ్లు మేం అధికారంలో ఉండి ఒక్కరినైనా వేధించామా? అని ప్రశ్నించారు.

'పోలీస్ సోదరురాలా... మేం అన్నీ రికార్డ్ చేస్తున్నాం. ప్రజల స్పందన చూసి అయినా మారాలి. డీసీపీ గారు మీరు మారాలి. లేదంటే ప్రజలు మీ మీదకు తిరగబడే రోజులు వస్తాయి జాగ్రత్త. మా కార్యకర్త... పెద్దపల్లి జిల్లా ధర్మారానికి చెందిన మన తెలంగాణ ఉద్యమకారుడు దల్వాజీ మాధవరావు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడని అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఈరోజు అతను కరీంనగర్ జైల్లో ఉన్నాడు. డీజీపీకి గౌరవం ఉంటే మాధవరావు అంశంలో విచారణ జరిపించాలి. అతనిపై దౌర్జన్యానికి పాల్పడిన ఎస్సై, సీఐలపై చర్యలు తీసుకోవాలి. లేదంటే తస్మాత్ జాగ్రత్త. న్యాయస్థానం తలుపు తడతాం. మేం కూడా మస్తుగా చూశాము' అని హెచ్చరించారు. మేం ఎప్పుడూ పోలీసులతో దౌర్జన్యాలు చేయించలేదని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం... అంబేద్క‌ర్ జ‌యంతి రోజున ఆ మ‌హానీయుడిని అవమానించిందని, క‌నీసం నివాళుల‌ర్పించ‌లేదని ధ్వ‌జ‌మెత్తారు.

More Telugu News