KCR: ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నా... రైతుకు బోనస్ ఇవ్వండి... మేం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయం: కేసీఆర్

  • ఎన్నికల సమయంలో బాండ్ రాసిచ్చినట్లుగా బోనస్ కోసం చిట్టీలు రాసివ్వండన్న కేసీఆర్
  • మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నామన్న కేసీఆర్
  • కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపు
KCR warning CM Revanth Reddy

'నేను ముఖ్యమంత్రిని... రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను... బోనస్ పేరు మీద మీరు తప్పించుకోలేరు. దానికి ఎన్నికల కమిషన్ అడ్డురాదు... మేం కూడా మీ పైన కంప్లయింట్ చేయబోం. ఏ రైతుకు ఎంత బాకీ ఉంటారో అంత బోనస్ చిట్టీలు రాసివ్వండి. ఎన్నికల సమయంలో బాండ్ రాసిచ్చారు కదా. అలా బాండ్ ఇచ్చినట్లుగా ఇవ్వండి. అలా కాదంటే ఎన్నికల తెల్లారి ఇవ్వండి. కానీ బోనస్ ఎగబెడతాం అంటే మాత్రం ఊరుకునేది లేద'ని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మనం దెబ్బతిన్నామని కేసీఆర్ అన్నారు. మనం ఉన్నప్పుడు రైతులు ధీమాగా ఉండేవారన్నారు. రైతుల ఖాతాల్లో రైతుబంధులు పడేవని, ఇరవై నాలుగు గంటలు నీళ్ళిచ్చామన్నారు. నేను కడుపులో పెట్టుకొని కాపాడిన రైతులు ఈరోజు ఆగం అవుతున్నారన్నారు. పంట బోనస్‌కు అందరం కలిసి కొట్లాడుదామన్నారు.

కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపు

తాము అధికారంలోకి వస్తే డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పి ఇప్పుడు దానిని అమలు చేయడం లేదని, వాయిదా వేసిందని విమర్శించారు. మహిళలకు రూ.2500తో పాటు ఏ హామీని నెరవేరలేదన్నారు. చావునోట్లో తలపెట్టి తెలంగాణ తీసుకు వచ్చామని, అధికారంలోకి వచ్చాక తెలంగాణను అభివృద్ధి చేశామన్నారు. రైతుబంధు తీసుకువచ్చామన్నారు. తాము అధికారంలోకి వస్తే పంటకు బోనస్ ఇస్తామని చెప్పి మాట తప్పారన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

రూ.2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని, ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.25వేల నష్టపరిహారం ఇవ్వాలని, బోనస్ ఇవ్వాలని, వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం పోస్టుకార్డుల ఉద్యమం ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే సిద్దిపేట రైతులు ఈ పోస్టుకార్డు ఉద్యమం ప్రారంభించారని గుర్తు చేశారు. రైతుబంధు ఏది? అని అడిగితే ఈ లిల్లీపుట్ గాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతుల సమస్యల గురించి అడిగితే పేగులు తీసి మెడలో వేసుకుంటాం... పండబెట్టి తొక్కుతాం... బాడీ మీద చెడ్డీలేకుండా చేస్తామంటూ అగౌరవంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. 

More Telugu News