BJP: బీఆర్ఎస్ ఇండియా కూటమిలో చేరడం ఖాయం: బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు

  • మోదీ మూడోసారి ప్రధాని అయితే పొన్నం ప్రభాకర్ రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అని ప్రశ్న
  • ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని వ్యాఖ్య
  • గంగుల కమలాకర్ ఇచ్చిన మూటలు తీసుకొని పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌కు పారిపోయారని విమర్శ
BJP leader says brs will join india alliance soon

బీఆర్ఎస్ ఇండియా కూటమిలో చేరడం ఖాయమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు జోస్యం చెప్పారు. బీజేపీ గెలవదని మంత్రి పొన్నం ప్రభాకర్ చెబుతున్నారని... మరి మోదీ మూడోసారి ప్రధాని అయితే ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అని సవాల్ విసిరారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని నుంచి బీజేపీ రాష్ట్ర నాయకుల వరకు అందరినీ కాంగ్రెస్ నాయకులు దుర్భాషలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు.

బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ ఇచ్చిన మూటలు తీసుకొని పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌కు పారిపోయారని... అక్కడా తక్కువ మెజార్టీతో గెలిచారన్నారు. కేటీఆర్‌తో చీకటి ఒప్పందాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. బీసీలకు బీజేపీ ఎక్కడ వ్యతిరేకమో చెప్పాలని నిలదీశారు. దేశానికి బీసీ వ్యక్తిని ప్రధానిగా చేసింది బీజేపీయే అన్నారు. రాష్ట్రంలో ఓ బీసీని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు. ఆధిపత్య సీఎం కింద పని చేస్తూ బీసీల గురించి పొన్నం మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది బీసీ నేతలు ఉన్నారో చర్చకు సిద్ధమా? అన్నారు.

More Telugu News