Car Accident: మృతదేహంతోనే 18 కిలోమీటర్లు వెళ్లిన కారు డ్రైవర్.. అనంతపురంలో రోడ్డు ప్రమాదం

  • బైక్ ను వేగంగా ఢీ కొట్టిన కారు..
  • ఎగిరి బానెట్ పై పడి చనిపోయిన బైకర్
  • ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం
Collided The Bike With The Car And Locked The Dead Body On The Bonnet For 18 Km In Anantapur

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీ కొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న వ్యక్తి ఎగిరి కారు బానెట్ పై పడ్డాడు. తీవ్రగాయాలతో చనిపోయాడు. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ బానెట్ పై డెడ్ బాడీ ఉన్నా గమనించకుండా అలాగే 18 కి.మీ. వెళ్లాడు. కారుపై మృతదేహాన్ని చూసి గ్రామస్థులు ఆపడంతో కారును వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. 

గ్రామస్థులు, పోలీసుల వివరాల ప్రకారం..
కూడేరు మండలం చోళ సముద్రానికి చెందిన జిన్నే ఎర్రి స్వామి(35) ట్రాక్టర్ మెకానిక్.. భార్య మంజుల, ఇద్దరు పిల్లలతో కలిసి ఎర్రి స్వామి అనంతపురంలో స్థిరపడ్డాడు. ఆదివారం సిద్ధరాంపురం వెళ్లిన ఎర్రి స్వామి రాత్రి 10 గంటల ప్రాంతంలో బైక్ పై తిరుగుప్రయాణం అయ్యాడు. ఈ క్రమంలో వై కొత్తపల్లి సమీపంలో కళ్యాణదుర్గం వైపు వెళుతున్న ఓ కారు స్వామి బైక్ ను ఢీ కొట్టింది. వేగంగా ఢీ కొట్టడంతో స్వామి ఎగిరి కారు బానెట్ పై పడి చనిపోయాడు.

మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ ఈ ప్రమాదాన్ని గుర్తించనేలేదు. బానెట్ పై మృతదేహంతోనే కారును 18 కిలోమీటర్లు తీసుకెళ్లాడు. కారుపై మనిషి పడి ఉండడం గమనించిన హనిమిరెడ్డిపల్లి గ్రామస్థులు కారును ఆపారు. దీంతో కిందికి దిగిన డ్రైవర్.. బానెట్ పై స్వామి మృతదేహాన్ని గమనించాడు. కారును అక్కడే వదిలేసి పారిపోయాడు. గ్రామస్థుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

More Telugu News