Seized Ship: చర్చలు సఫలం.. సీజ్ చేసిన నౌకలోని భారతీయ సిబ్బందిని కలిసేందుకు ఇరాన్ అనుమతి

  • ఇరాన్ ప్రభుత్వంతో మాట్లాడి ఖరారు చేసిన విదేశాంగమంత్రి జైశంకర్
  • 17 మంది నౌక సిబ్బందితో భారతీయ అధికారులకు భేటీ అయ్యేందుకు దక్కిన అవకాశం
  • వారిని విడిపించడంపై కూడా దృష్టిపెట్టిన భారత విదేశాంగ శాఖ
S Jaishankar says Indian Officials Allowed To Meet Indians On Seized Ship

ఇజ్రాయెల్‌పై దాడికి ఒక రోజు ముందు ఇరాన్ స్వాధీనం చేసుకున్న కార్గో షిప్‌లో ఉన్న 17 మంది భారతీయ సిబ్బందిని కలిసేందుకు భారత ప్రభుత్వ అధికారులకు అనుమతి లభించింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రంగంలోకి దిగి ఇరాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ అబ్దుల్లాహియాన్‌తో ఫోన్‌లో మాట్లాడి ఈ విషయాన్ని ఖరారు చేశారు. సీజ్ చేసిన నౌకకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నామని, త్వరలోనే భారత ప్రభుత్వ ప్రతినిధులు నౌకలోని భారతీయ సిబ్బందిని కలవొచ్చని ఆమిర్ చెప్పినట్టు జైశంకర్ వెల్లడించారు. మరోవైపు నౌకలోని సిబ్బందిని విడిపించడంపై కూడా భారత్ దృష్టిపెట్టింది. ఈ విషయాన్ని ఇరాన్‌తో చర్చించినట్టు జైశంకర్ తెలిపారు.

ఆదివారం సాయంత్రం ఆమిర్ అబ్దుల్లాహియాన్‌తో ఫోన్ లో మాట్లాడానని జైశంకర్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఆ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిపై చర్చించామని, ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరం కాకుండా సంయమనం పాటించాల్సిన ఆవశ్యకత గురించి గుర్తుచేశానని జైశంకర్ పేర్కొన్నారు. సంప్రదింపులకు అందుబాటులో ఉంటామని ఇరాన్ హామీ ఇచ్చిందని జైశంకర్ వివరించారు.

More Telugu News