K Kavitha: సీబీఐ కేసులో కవితకు జ్యుడీషియల్ కస్టడీ.. ఇది బీజేపీ కస్టడీ అన్న కవిత

  • 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని కోరిన సీబీఐ
  • 9 రోజుల పాటు కస్టడీని ఇచ్చిన కోర్టు
  • ఈ నెల 23 వరకు కస్టడీలో ఉండనున్న కవిత
Court extended Kavitha CBI custody

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు జ్యుడీషియల్ కస్టడీని విధించింది. మరో 9 రోజుల పాటు కవితను కస్టడీకి పంపింది. 15 రోజుల పాటు కస్టడీని ఇవ్వాలని కోర్టును సీబీఐ కోరింది. అయితే 9 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో ఈనెల 23 వరకు ఆమె కస్టడీలో ఉండనున్నారు. 

ఇటీవల సీబీఐకి మూడు రోజుల పాటు కవితను కస్టడీకి ఇచ్చిన సంగతి తెలిసిందే. మూడు రోజుల కస్టడీ ముగియడంతో ఆమెను సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో విచారణ సందర్భంగా... సాక్ష్యాలను కవిత ముందు ఉంచి ప్రశ్నించామని... ఆమె విచారణకు సహకరించలేదని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఉద్దేశ పూర్వకంగా విచారణను తప్పుదోవ పట్టించేలా ఆమె సమాధానాలు చెప్పారని వెల్లడించింది. ఆమెను విచారించేందుకు మరింత సమయం కావాలని కోరింది. ఈ నేపథ్యంలో కవిత కస్టడీని కోర్టు పొడిగించింది. 

మూడు రోజుల కస్టడీలో కేసులోని నిందితులు, అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలం, వాట్సాప్ చాట్ పై కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కవిత విచారణను సీబీఐ వీడియో రికార్డింగ్ చేసింది. లిక్కర్ స్కామ్ లో మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. తీహార్ జైల్లో ఉన్న సమయంలోనే ఆమెను సీబీఐ అదుపులోకి తీసుకుంది. 

మరోవైపు కోర్టు హాలు నుంచి బయటకు వస్తున్న సమయంలో అక్కడున్న మీడియాతో కవిత మాట్లాడుతూ... ఇది సీబీఐ కస్టడీ కాదని, బీజేపీ కస్టడీ అని అని అన్నారు. బీజేపీ నేతలు బయట మాట్లాడేవే... లోపల సీబీఐ అధికారులు అడుగుతున్నారని చెప్పారు. రెండేళ్ల నుంచి అడుగుతున్నదే అడుతుతున్నారని విమర్శించారు.

More Telugu News