Laxman: ఈ వ్యవహారం ఓ టీవీ సీరియల్ లా ఉంది: బీజేపీ నేత లక్ష్మణ్

  • ఫోన్ ట్యాపింగ్ అంశంపై లక్ష్మణ్ స్పందన
  • కేటీఆర్, రేవంత్ ఉత్తుత్తి సవాళ్లు విసురుకుంటారని వెల్లడి
  • ఇలాంటి కుట్రలను ప్రజలు నమ్మరని స్పష్టీకరణ 
BJP leader Laxman slams Revanth Reddy and KTR

బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ ఇవాళ హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ ల వైఖరి ఓ టీవీ సీరియల్ లా ఉందని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ పై రాష్ట్రంలో ఏం జరుగుతోంది? అని లక్ష్మణ్ ప్రశ్నించారు. అసలైన నిందితులను ఎందుకు పట్టుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాపింగ్ పై లై డిటెక్టర్ టెస్టుకు మేం సిద్ధం... మీరు సిద్ధమా? అని కేటీఆర్ అంటుంటే రేవంత్ రెడ్డి స్పందించడంలేదని తెలిపారు. గతంలో డ్రగ్స్ వ్యవహారంలో డీఎన్ఏ టెస్టుకు సిద్ధమా అని రేవంత్ రెడ్డి విసిరిన సవాలుకు కేటీఆర్ స్పందించలేదని లక్ష్మణ్ వివరించారు. 

కేవలం బీజేపీ పైనా, మోదీ పైనా ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలా పరస్పరం సవాళ్లు విసురుకుంటారని... కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ తోడుదొంగలని అన్నారు. ఇలాంటి కుట్రలను ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. 

కావాలంటే లై డిటెక్టర్ టెస్టులు తాము ఏర్పాటు చేస్తామని... చిత్తశుద్ధి ఉన్నవాళ్లయితే రేవంత్ రెడ్డి, కేటీఆర్ ముందుకు రావాలని లక్ష్మణ్ సవాల్ విసిరారు.

More Telugu News