Double Bed Room: కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత ఇంటి వద్ద డబుల్ బెడ్రూం లబ్ధిదారుల ఆందోళన

  • మొన్న కేసీఆర్ ఇంటి వద్ద లబ్దిదారుల ఆందోళన
  • నిన్న నివేదిత ఇంటి వద్ద బాధితుల బైఠాయింపు
  • దివంగత సాయన్న, నివేదిత కలిసి రూ. 1.46 కోట్లు వసూలు చేశారని ఆరోపణ
  • ఒక్కొక్కరినుంచి రూ. 5 లక్షలు వసూలు చేశారని ఆరోపణ
  • గతంలో రూ. 12 లక్షలు వెనక్కి ఇచ్చారంటున్న బాధితులు
  • బాధితుల్లో బీఆర్ఎస్ నాయకుడు సదానందగౌడ
Double Bedroom Beneficiaries Protest At BRS Candidate Niveditha House

బీఆర్ఎస్ కంటోన్మెంట్ అభ్యర్థి నివేదిత ఇంటి వద్ద డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. ఇళ్లు ఇప్పిస్తామంటూ దివంగత ఎమ్మెల్యే సాయన్న, నివేదిత కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశారంటూ మారేడుపల్లిలోని శనివారం ఆమె ఇంటి వద్ద నిరసన తెలిపారు. న్యాయం చేయాలంటూ బైఠాయించి వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రక్తత నెలకొంది.

ఈ ఘటన జరుగుతున్నప్పుడు నివేదిత ఇంట్లో లేరు. ప్రచారం కోసం బయటకు వెళ్లారు. నిరసనకు దిగినవారిలో సాయన్న అనుచరులు కూడా ఉన్నారని తెలిసింది. కాగా, రెండ్రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కూడా ఇటువంటి పరిస్థితే ఎదురైంది. సొంత నియోజకవర్గం గజ్వేల్‌కు చెందిన లబ్ధిదారులు కేసీఆర్ ఫామ్ హౌస్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని, కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆందోళన చేశారు. 

సాయన్న, ఆమె రెండో కుమార్తె, బీఆర్ఎస్ అభ్యర్థి అయిన నివేదిత లబ్ధిదారుల నుంచి రూ. 1.46 కోట్లు వసూలు చేసినట్టు బీఆర్ఎస్ నాయకుడు, బాధితుడు సదానందగౌడ్ ఆరోపించారు. ఇల్లు ఇప్పిస్తానని ఒక్కో బాధితుడి నుంచి రూ. 5 లక్షలు వసూలు చేశారని ఆందోళనకు దిగిన లబ్ధిదారులు ఆరోపించారు. ఇళ్లు ఇప్పించకపోవడంతో తమ డబ్బులు తమకు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో గతేడాది రూ. 12 లక్షలు వెనక్కి ఇచ్చారని, ఇంకా రూ. 1.34 కోట్లు ఇవ్వాల్సి ఉందని తెలిపారు.

More Telugu News