Ram Charan: నాకు డాక్టరేట్ ఇస్తున్నారంటే మా అమ్మ నమ్మలేదు: రామ్ చరణ్

  • రామ్ చరణ్ కు వేల్స్ వర్సిటీ గౌరవ డాక్టరేట్
  • నేడు చెన్నైలో డాక్టరేట్ అందుకున్న గ్లోబల్ స్టార్
  • కృతజ్ఞతలు తెలిపిన రామ్ చరణ్
  • తాను చెన్నైలోనే పుట్టి పెరిగానని వెల్లడి 
Ram Charan says her mother was shocked after Vels University announced doctorate

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తమిళనాడులోని సుప్రసిద్ధ వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఇవాళ చెన్నైలో జరిగిన వేల్స్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో రామ్ చరణ్ కు డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో రామ్ చరణ్ మాట్లాడారు. 

"నాపై ఇంత ప్రేమాభిమానాలు చూపించి గౌర‌వంతో డాక్ట‌రేట్ బ‌హూక‌రించిన వేల్స్ యూనివ‌ర్సిటీ వారికి మ‌నస్ఫూర్తిగా ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేసుకుంటున్నాను. ఈ వర్సిటీలో 45 వేల‌ మందికి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. 38 సంవత్స‌రాల‌కు పైగా ఈ యూనివ‌ర్సిటీని స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ చేస్తున్నారు. 

అలాంటి యూనివ‌ర్సిటీ నుంచి నాకు గౌర‌వ డాక్ట‌రేట్ ఇస్తున్నార‌నే విష‌యం తెలియ‌గానే మా అమ్మ‌ న‌మ్మ‌లేదు. ఆర్మీ గ్రాడ్యుయేట్ల మ‌ధ్య‌లో నేను ఈరోజు ఇలా ఉండ‌టం ఊహిస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. నిజానికి నాకు ద‌క్కిన గౌర‌వం నాది కాదు... నా అభిమానుల‌ది, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, నా తోటి న‌టీన‌టుల‌ది. వేల్స్ యూనివ‌ర్సిటీని ఇంత విజ‌య‌వంతంగా ముందుకు తీసుకెళుతున్న యాజ‌మాన్యానికి, టీచింగ్ సిబ్బందికి, విద్యార్థులకు మ‌న‌స్ఫూర్తిగా అభినంద‌న‌లు తెలియజేస్తున్నాను. 

చెన్నై నాకెంతో ఇచ్చింది. మా నాన్న‌గారు త‌న ప్ర‌యాణాన్ని ఇక్క‌డ నుంచే ప్రారంభించారు. నా అర్ధాంగి ఉపాస‌న వాళ్ల తాతగారు అపోలో హాస్పిట‌ల్స్‌ను కూడా ఇక్క‌డ నుంచే మొద‌లు పెట్టారు. తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో 80 శాతం మందికి చెన్నైతో మంచి అనుబంధం ఉంది. ఏదైనా సాధించాల‌ని క‌ల‌లు క‌ని చెన్నైకి వ‌స్తే అది నేర‌వేరుతుంది. అది ఈ ప్రాంతం గొప్ప‌త‌నం. అన్ని రంగాల వారి క‌ల‌ల‌ను నేరవేర్చేదిగా చెన్నై నగరం తన విశిష్టతను నిలుపుకుంటూ వ‌స్తోంది. నేను ఇక్క‌డ విజ‌య హాస్పిట‌ల్‌లోనే పుట్టాను... చెన్నైలోనే పెరిగాను.

సినిమాల విష‌యానికి వస్తే ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ శంక‌ర్‌ తో గేమ్ ఛేంజ‌ర్ సినిమా చేస్తున్నాను. ఆయ‌న‌తో వ‌ర్క్ చేయాల‌ని చాలా మంది అనుకుంటారు. నేను ఇప్పుడు ఆయ‌న‌తో వ‌ర్క్ చేయ‌టం మంచి ఎక్స్‌పీరియెన్స్‌. శంక‌ర్‌ ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డారు. డిఫ‌రెంట్ స్టోరీతో ఈ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ తెర‌కెక్కుతుంది. ఐదు భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబ‌ర్-అక్టోబ‌ర్ నెల‌ల్లో విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాం’’ అని రామ్ చరణ్ వెల్లడించారు.

More Telugu News