Bihar Voter: ఓటు వేసేదేలేదంటూ అభ్యర్థి ముఖంమీదే చెప్పేసిన బీహార్ ఓటర్.. వీడియో ఇదిగో!

  • బీహార్ లో ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి ఉపేంద్ర కుశ్వాహాకు చేదు అనుభవం
  • ఏనాడూ నియోజకవర్గంలోని గ్రామాల వైపు తొంగిచూడలేదని ఆరోపణ
  • ఇన్నాళ్లకు మీ దర్శనం కలిగింది.. ధన్యులమయ్యామని ఓటర్ల కామెంట్
Bihar Voter Rejects NDA Candidate To His Face

‘పద్దెనిమిదేళ్లుగా ఏనాడూ ఏ రాజకీయ నాయకుడూ మా గ్రామంవైపు తొంగి చూడలేదు.. ఇన్నాళ్లకు మీరు వచ్చారు. సంతోషం.. కానీ సార్ మా ఓట్లు మాత్రం మీకు వేయబోం’ అంటూ బీహార్ ఓటర్ ఓ నేత ముఖంమీదే చెప్పేశాడు. మీరంటే గౌరవం ఉందంటూనే మా ఓట్లు మీకు పడవని తేల్చిచెప్పాడు. దీంతో సదరు నేత ఏం మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బీహార్ లోని కారకట్ నియోజకవర్గంలో ఎన్డీఏ తరఫున బరిలో నిలిచిన ఉపేంద్ర కుశ్వాహాకు ఈ పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఎన్డీఏ అభ్యర్థి ఉపేంద్ర కుశ్వాహ కారకట్ నియోజకవర్గంలోని ఓ గ్రామానికి వెళ్లారు. స్థానికులు ఆయనను సాదరంగా ఆహ్వానించారు. ఆయన వచ్చారని గ్రామస్థులంతా గుమిగూడారు. దీంతో అక్కడే నాలుగు మాటలు మాట్లాడదామని ఉపేంద్ర కుశ్వాహ ప్రయత్నించారు. ఇంతలో స్థానిక లీడర్ ఒకరు గ్రామస్థుల తరఫున ఉపేంద్రతో మాట్లాడారు. సుమారు 18 ఏళ్లుగా తమ గ్రామానికి ఏ రాజకీయ నేత కూడా రాలేదని, ఇన్నాళ్లకు మీరు రావడం సంతోషమని చెప్పారు.

మీరంటే గౌరవం ఉంది, మిమ్మల్ని కలుసుకోవడం సంతోషంగా ఉంది.. కానీ మా ఓట్లు మాత్రం మీకు వేయలేమని ఉపేంద్ర కుశ్వాహ ముఖంమీదే చెప్పేశాడు. మర్యాదగా నమస్కరిస్తూనే ఓటేయమని చెప్పడంతో ఎలా స్పందించాలో తెలియక ఉపేంద్ర కుశ్వాహ మౌనాన్ని ఆశ్రయించారు. ఆపై ఇక మాట్లాడేదేమీ లేదని అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారు. ఈ ఘటన మొత్తం అక్కడున్న వారు రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ వీడియోను షేర్ చేస్తూ.. ఎన్డీఏ అభ్యర్థికి ఓటేయబోమని బీహార్ ఓటర్లు చాలా మర్యాదగా, ముఖంపైనే చేప్పారంటూ కామెంట్ చేసింది.

More Telugu News