KTR: ఏపీలో ఎవరు గెలవాలనుకుంటున్నారు...? కేటీఆర్ సమాధానం ఇదే...!

  • ఏపీలో అందరూ అన్నలాంటివారు... మిత్రులే, ఎవరు గెలిచినా మంచి జరగాలని కోరుకుంటున్నానన్న కేటీఆర్
  • ఏపీలో ఎవరు గెలవాలో చెప్పడానికి తనకు అక్కడ ఓటు హక్కు లేదన్న కేటీఆర్
  • తెలంగాణ ప్రజల కంటే ఏపీ ప్రజలు తెలివైన వారు... సరైన నిర్ణయం తీసుకుంటారన్న కేటీఆర్
KTR responds on AP politics

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని అడిగితే... అక్కడ హోరాహోరీగా కనిపిస్తోందని, అందరూ తన స్నేహితులేనని.. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. టీవీ9 'క్రాస్ ఫైర్'లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా హోస్ట్ ఏపీ రాజకీయాలపై ప్రశ్న సంధించారు. ఎవరు గెలుస్తారని భావిస్తున్నారు? అని అడిగారు.

దానికి కేటీఆర్ స్పందిస్తూ.. జగన్ తనకు అన్నలాంటి వాడని, లోకేశ్ తనకు స్నేహితుడని, చంద్రబాబు చాలా పెద్దవారని, పవన్ కల్యాణ్ కూడా అన్న వంటి వాడని పేర్కొన్నారు. ఎవరు గెలిచినా... ఆంధ్రాప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అక్కడ ఎవరు గెలవాలని మీరు కోరుకుంటున్నారని ప్రశ్నించగా... అలా చెప్పేందుకు తనకు అక్కడ ఓటు లేదని సరదాగా వ్యాఖ్యానించారు.

తాము తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉందామని చెప్పామని గుర్తు చేశారు. అందుకే హైదరాబాద్ ప్రాంతంలో ప్రత్యర్థులకు ఒక్క సీటు రాకుండా అన్నీ బీఆర్ఎస్ గెలుచుకుందన్నారు. విభజన వికాసానికే కాబట్టి ఏపీ, తెలంగాణ బాగుండాలన్నారు. ఆంధ్రా ప్రజలు మాకంటే.. తెలంగాణ ప్రజల కంటే తెలివైన వారని, వారు సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానన్నారు.

More Telugu News