KTR: రేవంత్ రెడ్డి మైక్ పట్టుకుంటే పూనకం వచ్చి ఏది పడితే అది మాట్లాడుతాడు: కేటీఆర్

  • ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపిందన్న కేటీఆర్
  • ప్రజలు ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుసుకుంటున్నారని వ్యాఖ్య
  • రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్... రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి అన్న కేటీఆర్
  • లోక్ సభ ఎన్నికల తర్వాత పథకాలకు మంగళం పాడుతారన్న కేటీఆర్
KTR satires on Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన మైక్ వీరుడంటూ ఎద్దేవా చేశారు. మైక్ పట్టుకుంటే చాలు పూనకం వచ్చి... ఏది పడితే అది మాట్లాడుతాడన్నారు. భువనగిరి పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ... కాంగ్రెస్, బీజేపీ వారికి భయపడేది లేదన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని... అరచేతిలో వైకుంఠం చూపించారన్నారు. కానీ ప్రజలు ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

రియ‌ల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి.. రేవంత్ రెడ్డి అంటే రియ‌ల్ ఎస్టేట్ అని ఎద్దేవా చేశారు. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో రియ‌ల్ ఎస్టేట్ ప‌రిస్థితి ఏమైంది? రియ‌ల్ ఎస్టేట్ ప‌డిపోవ‌డానికి కార‌ణం ఎవరు? ప్ర‌భుత్వానికి అవ‌గాహ‌న లేక‌పోవ‌డ‌మే కారణమన్నారు. ఇక్క‌డ ఫార్మా సిటీ పెట్టాలని... రైతుల‌కు మంచి ప‌రిహారం ఇచ్చి భూసేక‌ర‌ణ చేశామని, అనుమ‌తులు కూడా తెచ్చామన్నారు. ఆ కంపెనీల‌కు స్థలమిచ్చి ల‌క్ష‌ల మందికి కొలువులు తెచ్చే ఫార్మా సిటీని న‌డుపుకునే తెలివిలేని స‌న్నాసులు కాంగ్రెస్ నాయ‌కులు అని ధ్వజమెత్తారు.

కంపెనీలు, ఫ్యాక్ట‌రీలు, యూనివ‌ర్సిటీలు, కాలేజీలు వ‌స్తే రియ‌ల్ ఎస్టేట్ ఊపందుకుంటుందన్నారు. ఫాక్స్ కాన్ తెచ్చాం... మే నెల‌లో ప్రారంభం కావాల్సిన ప్రాజెక్టు ఇది... కానీ ఇప్ప‌టి వరకు ప్రారంభం కాలేదన్నారు. లోక్ సభ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన అన్ని ప‌థ‌కాల‌కు ముఖ్యమంత్రి మంగ‌ళం పాడటం ఖాయమన్నారు. ఈ వంద రోజుల్లో ఉచిత బ‌స్సు ఒక్క‌టే ప్రారంభం చేశాడని... పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌ర్వాత ఆ ఉచిత బ‌స్సు పథకానికి కూడా మంగ‌ళం పాడుతారన్నారు. ఈ పథకం వల్ల ఆర్టీసీకి రూ.1400 కోట్ల నష్టం వచ్చిందన్నారు.

More Telugu News