Nara Lokesh: దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసిన దార్శనికుడు నమో!: కోయంబత్తూరులో లోకేశ్ స్పీచ్

  • కోయంబత్తూరులో బీజేపీ అభ్యర్థి అన్నామలై తరఫున లోకేశ్ ప్రచారం
  • పీలమేడు సభకు హాజరు
  • సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలకు ప్రతిరూపం మోదీ అని కితాబు
  • అన్నామలైని గెలిపిస్తే కోయంబత్తూరు గొంతుకై పోరాడతారని పిలుపు
Nara Lokesh hails PM Modi in Coimbatore rally

సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలకు ప్రతిరూపం ప్రధాని నరేంద్రమోదీ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొనియాడారు. కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి, తమిళనాడు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామికి మద్దతుగా పీలమేడు ప్రాంతంలో తమిళనాడు బీజేపీ ఆధ్వర్యాన నిర్వహించిన బహిరంగ సభలో లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... మోదీ అంటే ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం. మోదీ అంటే ప్రపంచం మెచ్చిన నాయకత్వం అని అభివర్ణించారు. అందుకే మోదీని మేకర్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా అని యావత్ ప్రపంచం ప్రశంసిస్తోందని కీర్తించారు. 

భారత్ సమర్థతను మోదీ ప్రపంచానికి చాటారు

ప్రధాన మంత్రి అన్న యోజన, ఆవాస్ యోజన, ఉజ్వల్ యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్ వంటి పథకాలతో సంక్షేమానికే మోదీ కొత్త నిర్వచనం చెప్పారు. పదేళ్లలో దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసిన దార్శనికనేత నరేంద్ర మోదీ.  

ఒకపక్క సంక్షేమ పథకాలను అందిస్తూనే.....దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, గతి శక్తి, భారత్ మాల వంటి అభివృద్ది కార్యక్రమాలు తెచ్చి సంపద సృష్టించారు. డీమానెటైజేషన్, జీఎస్టీ సంస్కరణలతో దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేశారు. సబ్ కా సాత్ – సబ్ కా వికాస్ – సబ్ కా విశ్వాస్ అనే నినాదంతో దేశ ప్రజల్లో నమ్మకాన్ని నింపారు. 

మోదీ నేతృత్వంలో కోవిడ్ సంక్షోభాన్ని మన దేశం అధిగమించిన తీరు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. 100 దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చి దేశ సమర్థతను మోదీజీ ప్రపంచానికి చాటి చెప్పారు.

అమెరికా, చైనాలకు ధీటుగా భారత్ ఆర్థిక వ్యవస్థ! 

ప్రపంచంలో 11 వ స్థానంలో ఉన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థను 5 వ స్థానానికి తెచ్చిన సమర్థనేత నరేంద్ర మోదీ. రాబోయే 5 ఏళ్లలో అమెరికా, చైనాలతో పోటీ పడుతూ దీటైన ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని మార్చేందుకు ఆయన పనిచేస్తున్నారు. తమిళ భాష , సంస్కృతి, సంప్రదాయాలను ప్రధాని నరేంద్ర మోదీ ఎంతగానో గౌరవిస్తారు. 

74 వ ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రధాని తమిళంలో మాట్లాడారు. తమిళ సంస్కృతి, సంప్రదాయాలు కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించింది. తమిళనాడు అభివృద్ధి కోసం సుమారుగా రూ.2.31 లక్షల కోట్ల నిధులు కేటాయించారు. రైల్వేస్, రోడ్లు, ఆయుష్మాన్ భారత్ , బీమా యోజన, పరిశ్రమలకు రాయితీలు, తాగు, సాగునీటి ప్రాజక్టులు,స్మార్ట్ సిటీస్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు కేంద్రప్రభుత్వం అమలు చేసింది.

తమిళ ప్రజల పట్టుదల అంటే నాకు ఇష్టం!

దేశంలోనే అపార అభివృద్ధికి అవకాశాలున్న నేల కోయంబత్తూరు. మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియాగా పేరొందిన కోయంబత్తూర్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కోయంబత్తూర్ వచ్చాను. అనేకమంది పారిశ్రామికవేత్తలను, తెలుగు వారిని కలిశాను. ఎన్నికల ప్రచారానికి తమిళనాడు రావడం మాత్రం ఇదే మొదటి సారి... ఇదొక డిఫరెంట్ఎక్స్పీరియన్స్. తమిళ ప్రజల పట్టుదల నాకు ఇష్టం. తమిళ ప్రజలు భాష, సంస్కృతి, సంప్రదాయాలను ఎంతగానో ప్రేమిస్తారు. తమిళ భాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడానికి పోరాడుతూనే ఉంటారు. 

నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో చెబుతాను... దానికంటే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ప్రజలకి సేవ చెయ్యడానికి మీరు ఉద్యోగం వదులుకుంటారా? మీరు ఐఏఎస్, ఐపీఎస్ లేదా ప్రభుత్వ ఉద్యోగం వదులుకొని ప్రజలకి సేవ చెయ్యడానికి ముందుకు వస్తారా? అలాంటిది చిన్న వయస్సులో ఐపీఎస్ వదులుకొని ప్రజలకు సేవ చేస్తానని ముందుకు వచ్చిన సింగం అన్నామలై. 

దమ్మున్న నాయకుడు అన్నామలైని గెలిపించండి!

కర్ణాటకలో ఆయన సింగం ... ఐపీఎస్. తమిళనాడులో ఆయన టీపీఎస్. టీపీఎస్ అంటే తమిళ్ పీపుల్ సర్వీస్. నేను అన్నామలై ఫ్యాన్ ని, అన్నామలై నాకు మంచి మిత్రుడు. అన్నామలై ఒక దమ్మున్న నాయకుడు. కోయంబత్తూరు సర్వతోముఖాభివృద్ధికి అన్నామలైని గెలిపించుకోండి. అన్నామలై కాంట్రావర్సీ కామెంట్స్ చేశారు అని నేను కొన్ని ఆర్టికల్స్ చూశాను... ఆయన కాంట్రావర్సీ తో ఎదిగిన నాయకుడు కాదు... క్యాలిబర్ తో ఎదిగిన వ్యక్తి. 

అన్నామలై కి ఒక విజన్ ఉంది, తమిళనాడు దశ, దిశా మార్చే మాస్టర్ ప్లాన్ అన్నామలై దగ్గర ఉంది. నా మిత్రుడు అన్నామలై తరపున ప్రచారం చెయ్యడానికి ఇక్కడికి వచ్చాను. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఐపీఎస్ సాధించారు. సామాన్యుడి బాధలు చూసి నాయకుడిగా మారాడు. ఎన్ మన్ , న్ మక్కల్ పాదయాత్ర ఒక చరిత్ర... అన్నామలై తమిళ ప్రజల మనస్సు గెలుచుకున్నారు. 

అన్నామలైకి రైతు కష్టం తెలుసు, ఉద్యోగాలు లేక యువత పడుతున్న బాధలు తెలుసు, మహిళల సమస్యలు తెలుసు, పారిశ్రామిక వేత్తలు పడుతున్న ఇబ్బందులు తెలుసు. అన్నామలై మార్పు కోసం పోరాడుతున్నారు. ఈ ఎన్నికల్లో కోయంబత్తూరు ప్రజలు అన్నామలైని ఆశీర్వదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

అన్నామలై కల – వికసిత్ కోయంబత్తూరు

అన్నామలై కల వికసిత్ తమిళనాడు - వికసిత్ కోయంబత్తూరు. ఆయనను గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి మీ సమస్యలు తీరుస్తారు. గతంలో సీపీ రాధాకృష్ణన్ గారి లాంటి గొప్ప వ్యక్తులు ఇక్కడ ఎంపీగా పనిచేశారు. ఇప్పుడు యువకుడు అన్నామలైకి అవకాశం ఇవ్వండి. కోయంబత్తూరు ఓట్ ఫర్ అన్నామలై. ప్రస్తుతం కోయంబత్తూరు పార్లమెంట్ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయి. 

కోయంబత్తూరు సిటీ కూడా ఒక స్టేజ్ వరకూ అభివృద్ధి చెంది ఆగిపోయింది. యువతకు ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు అనేక ఇబ్బందులు పడుతున్నారు, తాగునీటి సమస్య, రోడ్లు , మౌలిక సదుపాయాలు కల్పించాలి.  ఇక్కడ ఉన్న ఫౌండరీలు ఎదుర్కుంటున్న సమస్యలు, పవర్ లూమ్, హ్యాండ్ లూమ్స్ సమస్యలు, ఆటోమొబైల్ ఆన్సిలరి పరిశ్రమల సమస్యలు, అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు అన్నీ అన్నామలైకి తెలుసు. 


More Telugu News