Sunil Gavaskar: ఐపీఎల్‌లో అదరగొడుతున్న ఆ యువ క్రికెటర్‌పై దృష్టిపెట్టిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ!

  • టీ20 వరల్డ్ కప్‌కు జట్టు ఎంపిక జరుగుతున్న వేళ రియాన్ పరాగ్‌పై సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • అతడిపై సెలక్షన్ కమిటీ దృష్టిపెట్టిందన్న మాజీ దిగ్గజం
  • క్రికెటర్ ఆడుతూ ఉండడమే అతడు చేయాల్సిన పనని వ్యాఖ్య
Sunil Gavaskar Says Selectors Have Eye On Youngster With 10 50s In 15 Games

ఒక పక్క ఐపీఎల్ 2024 జరుగుతుండగా.. మరోపక్క టీ20 వరల్డ్ కప్‌కు జట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది. ఐసీసీ గడువు ప్రకారం మే 1 లోగా జట్టుని ప్రకటించాల్సి ఉండడంతో ఏప్రిల్ నెలాఖరులోగా బీసీసీఐ జట్టుని ఎంపిక చేసే అవకాశాలున్నాయి. జట్టులో ఎవరెవరికి చోటు దక్కనుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఐపీఎల్‌లో అదరగొడుతున్న పలువురు యువ ఆటగాళ్లలో ఆశ్చర్యకరంగా ఎవరికైనా చోటు దక్కుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. మిగతా యువ క్రికెటర్ల ఆటగాళ్ల సంగతేమో గానీ ప్రస్తుత ఐపీఎల్‌లో దుమ్మురేపుతున్న యువ ఆటగాడు రియాన్ పరాగ్ పేరు గట్టిగానే వినిపిస్తోంది.

ఇందుకు బలం చేకూర్చుతూ టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సెలక్షన్ కమిటీ దృష్టి పెట్టిన ఆటగాడు రియాన్ పరాగ్ అని, అతడు చేయాల్సిందల్లా ఆడుతూ ఉండడమేనని గవాస్కర్ అన్నారు. స్టార్ స్పోర్ట్స్ మిడ్-ఇన్నింగ్స్ డిబేట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఐపీఎల్‌ 2024లో రియాన్ పరాగ్ అదరగొడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతున్న ఈ యువ ఆటగాడు ప్రత్యర్థి జట్టు బౌలర్లను చితక్కొడుతున్నాడు. అద్భుత ప్రదర్శనతో అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఐపీఎల్‌లో గత నాలుగు మ్యాచ్‌ల్లో 3 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. ఇక చివరి 15 టీ20 మ్యాచ్‌లను పరిగణనలోకి తీసుకుంటే అందులో 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మొత్తం 90 సగటుతో 771 పరుగులు చేశారు. స్ట్రయిక్ రేటు 170కి పైగానే ఉంది. కాగా టీ20 వరల్డ్ కప్ 2024 జూన్ నెలలో ఆరంభం కానుంది. ఈసారి కప్‌కు అమెరికా, వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి.

More Telugu News