Hardik Pandya: హార్దిక్ పాండ్యా సోదరులను మోసగించిన కేసులో వారి సవతి సోదరుడి అరెస్ట్

  • సవతి సోదరుడు వైభవ్ పాండ్యాతో కలిసి 2021లో పాలిమర్ వ్యాపారాన్ని ప్రారంభించిన హార్దిక్ సోదరులు
  • భాగస్వామ్య ఒప్పందాన్ని ఉల్లంఘించి వారికి తెలియకుండా మరో కంపెనీ పెట్టుకున్న వైభవ్
  • తొలి కంపెనీలో తన వాటాను 20 శాతం నుంచి 33.3 శాతానికి పెంచుకున్న వైనం
  • కంపెనీ ఖాతాల నుంచి లక్షల రూపాయల దారి మళ్లింపు
  • రూ. 4.3 కోట్లు నష్టపోయామంటూ పోలీసులకు హార్దిక్ సోదరుల ఫిర్యాదు
Hardik Pandyas stepbrother arrested for duping cricketer

టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాను మోసం చేసిన కేసులో వారి సవతి సోదరుడు వైభవ్‌పాండ్యా (37)ను పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. ముంబైలోని తమ భాగస్వామ్య కంపెనీ నుంచి రూ. 4.3 కోట్లు దారి మళ్లించినట్టు ఆయనపై కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. వైభవ్, పాండ్యా సోదరులు కలిసి 2021లో ముంబైలో పాలిమర్ వ్యాపారం ప్రారంభించారు. హార్దిక్, కృనాల్ ఇద్దరూ చెరో 40 శాతం పెట్టుబడి పెట్టగా, వైభవ్ మాత్రం 20 శాతం పెట్టుబడి పెట్టాడు. రోజువారీ కార్యకలాపాలను నిర్వహిస్తున్న వైభవ్.. లాభాలను మాత్రం ముగ్గురికీ సమానంగా పంచేవాడు.

తెలియకుండానే మరో కంపెనీ
భాగస్వాములుగా ఉన్న హార్దిక్‌పాండ్యా సోదరులకు తెలియకుండా వైభవ్ అలాంటి కంపెనీనే మరోటి ప్రారంభించాడు. ఈ క్రమంలో తొలి కంపెనీలో లాభాలు గణనీయంగా పడిపోయాయి. దాదాపు రూ. 3 కోట్ల నష్టం వాటిల్లింది. అంతేకాదు, కంపెనీలో తనకున్న 20 శాతం వాటాను రహస్యంగా 33.3 శాతానికి పెంచుకున్నాడు. భాగస్వామ్య కంపెనీ నుంచి చెప్పాపెట్టకుండా లక్షల రూపాయలు దారిమళ్లించడంతోపాటు, కంపెనీ ఖాతా నుంచి కోటి రూపాయలు తన జేబులో వేసుకున్నాడు. ఈ క్రమంలో వారిమధ్య వాగ్వివాదం జరిగింది. హార్దిక్ సోదరులను తీవ్రంగా హెచ్చరించిన వైభవ్.. వారి ప్రతిష్ఠను మంటగలిపేస్తానని హెచ్చరించాడు. దీంతోవారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వైభవ్ పాండ్యాను అరెస్ట్ చేశారు.

More Telugu News