Election Commission: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు ఎన్నికల సంఘం నోటీసులు

  • సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేసిన ఫిర్యాదుపై స్పందన
  • 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని కోరిన ఈసీ
  • ఇటీవల అనకాపల్లి బహిరంగ సభలో సీఎం జగన్‌పై పలు ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్
Election commission notices to Janasena chief Pawan Kalyan

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. స్కామ్ స్టార్, భూములు లాక్కునే వ్యక్తి , ఇసుక-మద్యం సామ్రాజ్యానికి అధినేత అంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి పవన్ కల్యాణ్ ఇటీవల ఆరోపణలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఏప్రిల్‌ 8న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా పవన్‌ మాట్లాడారని, పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించారు.

మల్లాది విష్ణు ఫిర్యాదును పరిశీలించిన ఈసీ 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని పవన్ కల్యాణ్‌ను కోరింది. కాగా ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల అనకాపల్లిలో నిర్వహించిన సభలో పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News