Konda Surekha: మోసం చేసేందుకు కేసీఆర్ మరోసారి ప్రజల ముందుకు వస్తున్నారు: కొండా సురేఖ

  • కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి
  • కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని వ్యాఖ్య
  • మూడు నెలల కాలంలోనే ఆరు పథకాలు అమలు చేశామన్న మంత్రి
Konda Surekha with medak nsui meeting

తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కేసీఆర్ మరోసారి ప్రజల వద్దకు వస్తున్నారని... ఆయన మాటలు నమ్మి మోసపోవద్దని మంత్రి కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతుందన్నారు. బుధవారం ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధి సన్నాహక సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పంటలు ఎండిపోవడానికి కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. పంటలు పండుతున్నాయంటే అందుకు కారణం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన నాగార్జునసాగరే అన్నారు. రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలను బీఆర్‌ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. గత కేసీఆర్ ప్రభుత్వం వాళ్ల కుటుంబం, బీఆర్ఎస్‌ నాయకులు, కార్యకర్తల కోసమే పని చేసిందని ఆరోపించారు.

పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి పనులు చేయలేదన్నారు. ఓవైపు హరీశ్ రావు, మరోవైపు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయలేదని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం మూడు నెలల కాలంలోనే ఆరు పథకాలను అమలు చేస్తోందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి నీలం మధును గెలిపించాలని కోరారు. కార్యకర్తలకు తగిన గౌరవం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ మాత్రమే అన్నారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌పై చేసే అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు.

More Telugu News