Mudragada Padmanabham: పవన్ కల్యాణ్ మగాడైతే నా గురించి డైరెక్ట్ గా మాట్లాడాలి: ముద్రగడ పద్మనాభం తీవ్ర వ్యాఖ్యలు

  • తనను క్యారెక్టర్ ఆర్టిస్టులతో తిట్టిస్తున్నారని ముద్రగడ మండిపాటు
  • పవన్ మగాడైతే ప్రెస్ మీట్ పెట్టి నేరుగా మాట్లాడాలని సవాల్
  • సీఎం జగన్ పై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపాటు
Mudragada Padmanabham fires on Pawan Kalyan

జనసేనాని పవన్ కల్యాణ్ పై కాపు నేత, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ మగాడైతే డైరెక్ట్ గా తన గురించి మాట్లాడాలని సవాల్ విసిరారు. సీఎం హోదాలో ఉన్న జగన్ ను ఉద్దేశించి నోటికొచ్చినట్టు పవన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను ఏదైనా మాట్లాడితే... సినిమాల్లో ఉండే క్యారెక్టర్ ఆర్టిస్టులతో తిట్టిస్తున్నారని దుయ్యబట్టారు. తెరచాటుగా తనను తిట్టించడం కాదని... ప్రెస్ మీట్ పెట్టి తన గురించి సూటిగా మాట్లాడాలని అన్నారు. మీరు వేసే ప్రశ్నలకు తాను సమాధానాలు చెపుతానని... అలాగే తాను వేసే ప్రశ్నలకు మీరు కూడా సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో పుట్టారని... ఆ తెలంగాణ రాష్ట్రం వేరు, మన ఏపీ వేరని ముద్రగడ అన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చి పిఠాపురంలో ఎమ్మెల్యే కావాలని కోరుకోవడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. హైదరాబాద్ లో అవమానం జరిగినప్పుడు ఇప్పుడున్న ఈ పౌరుషం, కోపం, పట్టుదల ఏమయ్యాయని అడిగారు. అవమానించిన వారి ఇంటికే వెళ్లి టిఫిన్ చేశారని ఎద్దేవా చేశారు. 

పవన్ రెచ్చిపోయి మాట్లాడుతున్నారని ముద్రగడ విమర్శించారు. ఎన్నికల్లో వైసీపీ కోట్లు ఖర్చు పెడుతుందని అంటున్నారని... ప్రజలు అమ్ముడుపోతారనే కోణంలో మాట్లాడుతున్నారని అన్నారు.

More Telugu News