Dharmapuri Srinivas: ఆసుపత్రిలో చేరిన డీఎస్.. ఫొటో ట్వీట్ చేసిన ఎంపీ అరవింద్

  • మూత్రనాళ ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్న సీనియర్ నేత
  • హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేర్పించినట్లు వెల్లడి
  • వృద్ధాప్యం కారణంగా డీఎస్ ను వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు
Congress Party Senior Leader DS Hospitalized In Hyderabad

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు డి. శ్రీనివాస్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. కొంతకాలంగా ఇంటికే పరిమితమైన డీఎస్.. వృద్ధాప్యం కారణంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తాజాగా మూత్రనాళంలో ఇన్ ఫెక్షన్ తో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయాన్ని డీఎస్ కుమారుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వెల్లడించారు. ఈమేరకు ఆసుపత్రి బెడ్ పై ఉన్న డీఎస్ తో ఉన్న ఫొటోను ఆయన ట్వీట్ చేశారు.

కాగా, డీఎస్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసి ఆయన అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన త్వరగా కోలుకుని ఇంటికి చేరుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ లో చేరిన డీఎస్ ను ఆ పార్టీ పెద్దల సభకు పంపించింది. అయితే, గతేడాది డీఎస్ తిరిగి సొంతగూటికి చేరారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం వృద్ధాప్యం కారణంగా జూబ్లీహిల్స్ లోని తన నివాసానికే పరిమితమయ్యారు.

More Telugu News