Arvind Kejriwal: సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్

  • అరెస్టు అక్రమం కాదంటూ పిటిషన్ కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
  • కోర్టుపై గౌరవం ఉందంటూనే తీర్పును అంగీకరించలేమన్న ఆప్
  • హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసిన ఢిల్లీ సీఎం
Arvind Kejriwal moves Supreme Court against his arrest

లిక్కర్ పాలసీ స్కాంలో తన అరెస్టు అక్రమమని, నిబంధనల ఉల్లంఘనే అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టు తలుపుతట్టారు. తనను వెంటనే విడుదల చేయాలంటూ ఆదేశాలివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇవే అంశాలతో ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను మంగళవారం విచారించిన కోర్టు.. కేజ్రీవాల్ అరెస్టులో ఎలాంటి అతిక్రమణలు జరగలేదని తేల్చింది. ఆధారాలు ఉన్నాయంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేసిన వాదనతో ఏకీభవించింది. కేజ్రీవాల్ అరెస్టు సక్రమమేనని పేర్కొంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ పిటిషన్ ను కొట్టేసింది. 

దీనిపై ఆ పార్టీ నేతలు స్పందిస్తూ.. ఢిల్లీ హైకోర్టుపై తమకు గౌరవం ఉందని, అయితే, తాజా తీర్పును మాత్రం ఆమోదించబోమని చెప్పారు. హైకోర్టులో చుక్కెదురు కావడంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బుధవారం ఈమేరకు కేజ్రీవాల్ లాయర్లు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ కు సుప్రీంకోర్టు ఊరట కల్పించిన విషయం గుర్తుచేస్తూ.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కూడా సుప్రీంకోర్టులో ఊరట లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆప్ నేత, ఢిల్లీ మంత్రి సౌరబ్ భరద్వాజ్ మంగళవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.

More Telugu News