Karnataka: తుపాకీతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు అతి సమీపంలో వ్యక్తి హల్‌చల్!... వీడియో ఇదిగో

  • బెంగళూరు విల్సన్ గార్డెన్ సమీపంలో ఘటన
  • సీఎం ప్రచారం నిర్వహిస్తున్న వాహనం బ్యానెట్ పైకి... తుపాకీతోనే ఎక్కి పూలమాలలు వేసిన వ్యక్తి
  • తుపాకీతో సీఎంకు సమీపానికి వెళ్లిన వ్యక్తిని రియాజ్‌గా గుర్తించిన పోలీసులు
Man with gun goes close to CM Siddaramaiah

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రచార ర్యాలీలో ఓ కాంగ్రెస్ నాయకుడు తన నడుముకు కట్టుకున్న బెల్టుకు తుపాకీతో కనిపించడం కలకలం రేపింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో సిద్ధరామయ్య మంత్రి రామలింగారెడ్డి కూతురు, కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డి తరఫున బెంగళూరులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నడుముకు బెల్ట్ కట్టుకున్న ఓ వ్యక్తి తుపాకీతో వచ్చి ముఖ్యమంత్రి ముందే హల్‌చల్ చేశాడు. ఈ ఘటన బెంగళూరులోని విల్సన్ గార్డెన్‌ సమీపంలో చోటుచేసుకుంది.

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రి రామలింగారెడ్డి, అభ్యర్థి సౌమ్యారెడ్డి నిలబడి ఉన్న ఓపెన్‌ టాప్‌ వాహనం బానెట్‌పైకి ఎక్కి ఆ వ్యక్తి హడావిడి చేశాడు. ముఖ్యమంత్రికి మినహా పక్కన ఉన్న అందరికీ మెడలో పూలదండలు వేశాడు. అనంతరం వాహనం పైనుంచి కిందకు దూకాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. మారణాయుధం ధరించి ఉన్న వ్యక్తి సీఎంకు అత్యంత సమీపంలోకి ఎలా వెళ్లగలిగాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన భద్రతాలోపాన్ని ఎత్తిచూపుతోంది.

తుపాకీతో ముఖ్యమంత్రి వద్దకు వెళ్లిన వ్యక్తిని రియాజ్‌గా పోలీసులు గుర్తించారు. ఆత్మరక్షణ కోసం అతను కొన్నేళ్ల నుంచి తుపాకీని వెంట పెట్టుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో లైసెన్స్డ్‌ తుపాకులను పోలీసులకు అప్పగించాల్సి ఉన్నప్పటికీ.. అతనికి పొంచి ఉన్న ముప్పు తీవ్రత కారణంగా తన తుపాకీని పోలీసులకు అప్పగించకుండా మినహాయింపు పొందినట్లు చెప్పారు. లైసెన్స్డ్‌ తుపాకీ కలిగి ఉన్నంత మాత్రాన ముఖ్యమంత్రి సమీపంలోకి ఎలా వస్తాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

More Telugu News